హనుమాన్ 50 రోజులు – 5 పాఠాలు

నిన్నటితో హనుమాన్ బ్లాక్ బస్టర్ రన్ క్లైమాక్స్ కు వచ్చేసింది. పాతిక రోజులు ఆడటమే స్టార్ హీరోలు గొప్పగా భావిస్తున్న టైంలో ఏకంగా 150 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం జరుపుకోవడం మాటలు కాదు. కొన్ని సెంటర్లలో గత రెండు వారాల నుంచే నెమ్మదించినప్పటికీ మొత్తం వసూలైన రెవెన్యూ కోణంలో చూసుకుంటే కాసింత డెఫిషిట్లు వచ్చిన షోలు కూడా నష్టాన్ని ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఈ సినిమా నేర్పించిన 5 కీలక పాఠాలు ఏంటో చూద్దాం.

  1. నమ్మకముంటే భయమెందుకు

అపోజిషన్లో పెద్ద హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఉన్నారు. థియేటర్లు సరిగా దొరికే పరిస్థితి లేదు. అయినా నెమ్మదిగా అయినా సరే జనం చూస్తారనే దర్శక నిర్మాతల నమ్మకం గెలిచింది. వందా రెండు వందలు కాదు ఏకంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ తో తొంభై రెండేళ్ల టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీను సృష్టించుకుంది. స్టార్ లేకుండానే ఈ ఫీట్ సాధించింది.

  1. ఓటిటికి తొందరపడొద్దు

సలార్, గుంటూరు కారం లాంటి బడా సినిమాలే 28 రోజుల గ్యాప్ తో ఓటిటికి అగ్రిమెంట్లు చేసుకుంటున్న టైంలో ఫిఫ్టీ డేస్ మైలురాయి అందుకున్నా హనుమాన్ ఇప్పటిదాకా డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోలేదు. రన్ చూసి సహకరించిన జీ 5 ప్లాట్ ఫార్మ్ దానికి అనుగుణంగానే మొత్తం థియేట్రికల్ రన్ పూర్తయ్యాక డిజిటల్ రిలీజ్ కు సిద్ధపడుతోంది. మార్చి 8 లేదా ఆపై వారం వచ్చే అవకాశముంది.

  1. క్వాలిటీనే బ్రాండ్ ఇమేజ్

హనుమాన్ ని వందల కోట్ల బడ్జెట్ లో తీయలేదు. అయినా సరే దర్శకుడు ప్రశాంత్ వర్మ విఎఫెక్స్ విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్క్రీన్ మీద అద్భుతమైన అవుట్ ఫుట్ వచ్చేలా చేసింది. గ్రాఫిక్స్ నాణ్యత ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వచ్చేది. అందుకే ఏడెనిమిది నెలల పాటు కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమే టీమ్ సమయం ఖర్చు పెట్టడం వల్ల ఇవాళ ఇంత గొప్ప ఫలితం అందుకుంది.

  1. టీమ్ వర్క్ విజయ రహస్యం

కోట్లు రెమ్యునరేషన్లు తీసుకునే టాప్ టెక్నీషియన్లు పని చేయలేదు. ఇండియా మొత్తం గుర్తింపు ఉన్న సాంకేతిక వర్గం లేదు. ఉన్నంతలో బెస్ట్ టాలెంట్ ని వెతికి పట్టుకున్న ప్రశాంత్ వర్మ వాళ్లందరితోనూ తనకు కావాల్సిన అవుట్ ఫుట్ రాబట్టుకోవడంలో చూపించిన శ్రద్ధ ఇవాళ అతన్ని తిరుగులేని టాప్ లీగ్ లోకి తీసుకుళ్లింది. సీక్వెల్ జై హనుమాన్ కు బలమైన పునాది వేసింది.

  1. కంటెంటే నిజమైన స్టార్

హీరో హీరోయిన్లు తేజ సజ్జ, అమృత అయ్యర్ ఇంకా అప్ కమింగ్ స్టేజిలో ఉన్నారు. విలన్ వినయ్ వర్మ బాలీవుడ్ నుంచి రాలేదు. నోటెడ్ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ అక్క పాత్ర చేసింది. నటీనటులు చాలా మటుకు మీడియం మరియు చిన్న చితకా తరహాకు చెందివారే. అయినా సరే సరైన కంటెంట్ లో పడ్డారు కాబట్టి పాత్రలకు అనుగుణంగా అద్భుతంగా నటించి హిస్టరీలో భాగమయ్యారు.