తెలుగులోకి మలయాళం సినిమాల వరద

ఇప్పుడు ఇండియాలో ఎంతో సంతోషంగా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ఏదంటే.. మాలీవుడ్ అని చెప్పేయొచ్చు. అన్ సీజన్ అని భావించే ఫిబ్రవరిలో ఈ ఇండస్ట్రీ నుంచి నాలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు రావడం విశేషం. ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్‌ థ్రిల్లర్‌ మూవీ అన్వేషిప్పిన్‌ కండేదుం రిలీజై మంచి టాక్‌ తెచ్చుకుంది. తర్వాతి మూడు వారాల్లో రిలీజైన ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్ సైతం బ్లాక్‌బస్టర్లు అయ్యాయి.

ఈ సినిమాలకు కేరళ అవతల కూడా మంచి స్పందన వస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మలయాళ వెర్షన్లకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ స్పందన చూసి ఒక్కో సినిమాను తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ మమ్ముట్టి సినిమా ‘భ్రమయుగం’ను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్ రిలీజ్ చేసింది.

‘ప్రేమలు’ చిత్రాన్ని మార్చి 8న రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరో చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే.. మంజుమ్మెల్ బాయ్స్. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రిలీజైన రోజు నుంచి హౌస్ ఫుల్ వసూళ్లతో ఆడుతోంది. హైదరాబాద్‌లో కూడా షోలు బాగా రన్ అవుతున్నాయి. ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను మార్చి 15న తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. పేరున్న బేనరే తెలుగు వెర్షన్‌ను తీసుకురాబోతోంది.

ఒకప్పుడు అనువాదాల విషయంలో మన వాళ్ల దృష్టంతా తమిళ చిత్రాల మీదే ఉండేది. అక్కడ సక్సెస్ అయిన ప్రతి సినిమానూ తెలుగులోకి తెచ్చేసేవారు. ఫ్లాప్ సినిమాలు కూడా అనువాదం అయ్యేవి. ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాల సత్తా ఏంటో మన వాళ్లకు బాగా తెలిసి, వాటికి బాగా అలవాటుపడిన నేపథ్యంలో ఆ చిత్రాలు పెద్ద ఎత్తున రీమేక్ కావడంతో పాటు తెలుగులోకి డబ్ అవుతున్నాయి.