టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఆయన చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం దశాబ్ద కాలం నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు.
‘శ్రీరస్తు శుభమస్తు’ మినహాయిస్తే తన కెరీర్లో నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేదు. కొత్త జంట, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలు మాత్రం ఓ మోస్తరుగా ఆడాయి. మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లే. మలయాళంలో మోహన్ లాల్ లాంటి టాప్ స్టార్ తో కలిసి ఒక సినిమా చేసినా ఫలితం లేకపోయింది.
శిరీష్ నుంచి చివరగా వచ్చిన బడ్డీ కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు. దీంతో తర్వాత అతను కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చెయ్యలేదు. ఇటీవలే నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ శిరీష్.. వృత్తిగత జీవితంలో ఏం చెయ్యబోతున్నాడో ఎవరికి క్లారిటీ లేదు.
ఇలాంటి టైంలో శిరీష్ యథాలాపంగా చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అల్లు వారి కొత్త మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్ ఆరంభ వేడుకకు తన భార్యతో కలిసి హాజరైన సందర్భంగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో సెల్ఫీలు దిగాడు శిరీష్. ఈ సందర్భంగా శిరీష్.. “ఇవన్నీ నాకెందుకు.. రిటైర్ అయిపోయిన వాడిని” అని వ్యాఖ్యానించాడు.
మాటల మధ్యలో యథాలాపంగా చేసిన కామెంట్ అయినప్పటికీ అల్లు వారసుడు ఈ మాట అనడం ఆశ్చర్యానికి గురి చేసేదే. అక్కడ పూర్తి సంభాషణ ఏంటి.. శిరీష్ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడు అన్నది స్పష్టత లేదు కానీ.. అతను ఇకపై సినిమాలు చెయ్యక పోవచ్చనే అనిపిస్తోంది.
బడ్డీ మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావస్తోంది. శిరీష్ తర్వాత కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చెయ్యలేదు. అల్లు అరవింద్ బిజినెస్ మైండ్ గురించి అందరికీ తెలిసిందే. అనుకున్నంత సక్సెస్ కానీ కొడుకుని జనం మీదికి బలవంతంగా రుద్దాలని, వేరే నిర్మాతల్లా ఇష్టానుసారం డబ్బులు పొయ్యాలని చూసే రకం కాదు ఆయన.
కాబట్టి శిరీష్ నిజంగానే నటనకు దూరం అయిపోతే ఆశ్చర్యం లేదు. అల్లు సినిమాస్, అల్లు స్టూడియోస్, గీతా ఆర్ట్స్ సహా చూసుకోవాల్సిన వ్యాపారాలు, బాధ్యతలు చాలానే ఉన్నాయి కాబట్టి శిరీష్ ఖాళీగా ఏమి ఉండాల్సిన అవసరం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
