వీరమల్లుపై నిర్మాత మాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ‘హరిహర వీరమల్లు’ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. పవన్ స్టామినాను సరిగ్గా ఉపయోగించుకునేలా కనిపించింది ఈ చిత్రం. దీని కథాంశం, బడ్జెట్ అన్నీ కూడా ఒక రేంజిలో కనిపించాయి. ‘హరిహర వీరమల్లు’ టీజర్ చూసి అప్పట్లో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ భారీ చిత్రం రకరకాల కారణాల వల్ల విపరీతంగా ఆలస్యం అవుతోంది. అసలు ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజవుతుందో ఏమాత్రం క్లారిటీ లేదు.

ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. దాన్ని ఖండిస్తూ.. చిత్రీకరణ 80 శాతం పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయని.. త్వరలోనే అభిమానుల కోసం ఒక అప్‌డేట్ ఇవ్వబోతున్నామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా గురించి మాట్లాడారు. “పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే 20 రోజుల్లో ఏదో ఒక సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నేను ఆయనతో తీస్తున్న సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకున్నాను. ఆయనకు మంచి పేరు రావాలనుకున్నాను. అందుకే తొలిసారిగా ఆయనతో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. ఈ సినిమా ఆగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. అభిమానులు ఇలాంటి ప్రచారాలను నమ్మకండి. ఈ సినిమాకు రెండో భాగం కూడా కచ్చితంగా ఉ:టుంది. ఈ సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తారు” అని రత్నం స్పష్టం చేశారు. మార్చి 8న శివరాత్రి కానుకగా ‘హరిహర వీరమల్లు’ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.