బందిపోట్ల వేటలో బాలయ్య మాస్ యాక్షన్

వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీతో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ లో కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న లీక్. సెల్ ఫోన్లు, టెక్నాలజీ లేని 80 దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రివెంజ్ డ్రామాగా మలచినట్టు తెలిసింది. దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న పాత్రకు బాలయ్యకు బలమైన లింక్ ఉంటుందని, ఊహించని స్థాయిలో దాన్ని డిజైన్ తీసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని అంటున్నారు. వాల్తేరు వీరయ్యలో రవితేజకు అయిదు రెట్లు ఎక్కువ ఉంటుందట.

ఒకరకంగా చెప్పాలంటే షోలేలో గబ్బర్ సింగ్ ని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలు కాకుండా బాలయ్య ఒక్కడే ఎదురుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో బాబీ రాసుకున్నట్టు వినిపిస్తోంది. అధికారికంగా చెప్పేది కాదు కానీ ఆఫ్ ది రికార్డు నమ్మకమైన సోర్స్ నుంచే వచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఇది రూపొందుతోంది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ అంటున్నారు కానీ ఇంకా ఖరారుగా తెలియలేదు. ఊర్వశి రౌతేలాకు మాత్రం ప్రాధాన్యం ఉన్న రోల్ దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కీలకమైన ఫైట్లు తీస్తున్నారట.

సో మళ్ళీ వింటేజ్ బాలయ్యని బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతోంది కదా. విడుదల తేదీ ఇంకా లాక్ చేసుకోలేదు. షూటింగ్ కనీసం ముప్పాతిక అయ్యేదాకా రిలీజ్ గురించి ఆలోచించవద్దని ముందే ఫిక్స్ అయ్యారట. కుదిరితే ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం సంక్రాంతికి కానుకగా వదిలే అవకాశాలు లేకపోలేదు. అఖండ డిసెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అయినా లేదా జనవరి పండగని నమ్ముకున్నా అభిమానులు హ్యాపీనే. మరి ఇందులో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తాడా లేక ఖాకీ దుస్తుల్లో వెంటాడతాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. వేచి చూడాలి.