వీరమల్లు నుంచి వేదం సరోజ వైపు

నాలుగేళ్లవుతున్నా విడుదల ఎప్పుడు ఉండొచ్చో అర్థం కానీ సందిగ్ధంలో హరిహర వీరమల్లు నుంచి కొత్త ప్రాజెక్టు వైపు షిఫ్ట్ అయిపోవాలని దర్శకుడు క్రిష్ నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా చాలా భాగం పెండింగ్ ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతల్లో ముందు ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ఈ లెక్కన వీరమల్లు సెట్స్ లోకి అడుగు పెట్టాలంటే ఇంకో ఏడాది పైనే సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే బోలెడు సమయం ఖర్చయిపోయింది కాబట్టి క్రిష్ ఈలోగా ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసుకుని ఫైనల్ వెర్షన్ లాక్ చేశాడట.

వేదంలో సరోజగా రిస్కీ పాత్రను చేసి శబాష్ అనిపించుకున్న స్వీటీ అనుష్కతోనే దీన్ని తెరకెక్కించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ తెరకెక్కిస్తారని తెలిసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విజయం తర్వాత అనుష్కకు విశ్వంభర ఆఫర్ వెళ్ళింది. కానీ చిరంజీవి సినిమా అందులోనూ ఫాంటసీ జానర్ కాబట్టి డేట్లు ఎక్కువ అవసరమవుతాయనే ఉద్దేశంతో క్రిష్ చెప్పిన స్క్రిప్ట్ కే ఒకే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా అంగీకారం జరిగిపోయిందని తెలిసింది. హీరోగా ఎవరు చేస్తారనేది సస్పెన్స్. ఇంకా వెయిట్ చేయాలి.

వీలైనంత వేగంగా తీయాలనే ప్రణాళికతో క్రిష్ ఉన్నాడట. జానర్ ఏంటి లాంటి లీక్స్ ఇంకా రాలేదు. సోషల్ మెసేజ్ తోనే ఒక డిఫెరెంట్ కాన్సెప్ట్ రాసుకున్నారని తెలిసింది. భాగమతి తర్వాత చాలా సెలెక్టివ్ గా మారిపోయిన అనుష్క బయట కనిపించడం పూర్తిగా మానేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎంత బ్లాక్ బస్టర్ అయినా మీడియా ప్రమోషన్లకు దూరంగా ఉంది. ఇంటర్వ్యూలకు సైతం ఎస్ చెప్పలేదు. మొన్న బెంగళూరులో ఒక ప్రైవేట్ ఈవెంట్ కి వచ్చిన అనుష్క మాస్క్ వేసుకున్నా సరే ఫ్యాన్స్ గుర్తుపట్టిన వీడియో వైరలయ్యింది. చూడాలి మరి స్వీటీ ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతుందో.