నెపోటిజంపై మృణాల్ పంచ్ అదిరిపోలా

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేదు.. నెపోటిజం గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ వారసత్వంతో వచ్చిన హీరోలు, హీరోయిన్లే ఎక్కువ.. ఆ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది కాబట్టి దీని గురించి చర్చ ఎప్పటికీ ఆగదు. నెపోటిజం గురించి నెపో కిడ్స్‌ను అడిగితే వాళ్లేమీ సమాధానం చెప్పలేరు. మహా అయితే ఎంట్రీ వరకే ఇది ఉపయోగపడుతుందని.. తర్వాత సొంత టాలెంట్ చూపిస్తేనే మనగలం అంటారు.

మరి ఈ నెపో కిడ్స్ వల్ల టాలెంట్ ఉన్న మిగతా వాళ్లకు అన్యాయం జరుగుతోందంటారా అని మీడియా వాళ్లు నాన్-నెపో యాక్టర్లను అడుగుతుంటారు. వాళ్లు కొంచెం డిప్లమాటిగ్గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఐతే ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లోనూ జయకేతనం ఎగుర వేస్తున్న మృణాల్ ఠాకూర్ ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

నెపోటిజం సమస్యా అని అందరినీ అడిగే మీడియా వాళ్లే దాన్ని పెద్దది చేస్తుంటారని ఆమె వ్యాఖ్యానించింది. తాను గతంలో ఒక వేడుక సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్నానని.. అప్పుడే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అక్కడికి వచ్చిందని.. దీంతో మీడియా వాళ్లు తనను వదిలేసి మైకులు, కెమెరాలు పట్టుకుని తన వైపు వెళ్లిపోయారని ఆమె గుర్తు చేసింది.

ఇలా వారసత్వ హీరోలు, హీరోయిన్లను ఎక్కువ హైలైట్ చేసేది, వాళ్ల చుట్టూ తిరిగేది మీడియానే అని.. మళ్లీ వాళ్లే నెపోటిజం గురించి తెగ మాట్లాడుతుంటారని ఆమె వ్యాఖ్యానించింది. మీడియా అని కాక అందరికీ ఇది వర్తిస్తుందని ఆమె పేర్కొంది. వారసత్వంతో వచ్చే హీరో హీరోయిన్లను అంత హైలైట్ చేస్తూ.. మరోవైపు నెపోటిజం మీద లెక్చర్లు దంచితే ఏం లాభం అన్నట్లుగా మృణాల్ ఇచ్చిన పంచ్ సూపర అంటూ నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు.