తమిళంలో హిట్టు కొట్టిన తెలుగు నిర్మాతలు

గత కొన్నేళ్లలో సినిమాల పరంగా భాషలు, ప్రాంతాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఓటీటీలు, పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అని అన్ని భాషల వాళ్లూ అన్ని ఇండస్ట్రీల సినిమాలూ చూసేస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వేర్వేరు ఇండస్ట్రీలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతలు కూడా తమ పరిధిని విస్తరిస్తున్నారు.

ఓవైపు సొంత ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర ఇండస్ట్రీలకు వెళ్లి కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు గత ఏడాది కోలీవుడ్‌కు వెళ్లి ‘వారిసు’ సినిమాను అందించారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ఓ సినిమా తీస్తోంది. టాలీవుడ్లో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ మధ్యే కోలీవుడ్లో అడుగు పెట్టింది.

తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా.. తమిళంలోకి ఓ చిన్న సినిమాతో అడుగు పెట్టింది. ఆ సినిమానే.. వడక్కుపట్టి రామసామి. కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. కార్తీక్ యోగి దర్శకుడు. ఈ వీకెండ్లోనే ఈ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.

విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు కానీ.. కామెడీ ప్రియులను సినిమా బాగా ఆకట్టుకోవడంతో వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఆదివారానికి సినిమా సూపర్ హిట్ రేంజికి వెళ్లిపోయింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. పెద్ద సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. సంతానంకు కూడా చాన్నాళ్ల తర్వాత హీరోగా మంచి విజయం దక్కినట్లే కనిపిస్తోంది. తమిళంలో పీపుల్స్ మీడియా సంస్థకు తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ పడింది.