పీపుల్స్ మీడియాది మాములు స్పీడ్ కాదు

ఒకప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఏడాదికి పదికి పైగా సినిమాలు వచ్చేలా చేసుకుని రికార్డులు సృష్టించారు. ఇప్పటికీ ఆ వేగాన్ని అందుకున్న వాళ్ళు లేరు. మలయాళంలో మమ్ముట్టి వయసు మళ్ళాక కూడా ఈ స్పీడ్ చూపించారు కాబట్టే నాలుగు వందలకు పైగా చిత్రాలతో ఎవరూ అందుకోలేని ఎత్తుకు పరిగెడుతున్నారు. నిర్మాతలకు ఇది సాధ్యం కాదు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొత్త ట్రెండ్ కి దారి చూపిస్తోంది. 2024లో ఒకటి రెండు కాదు ఏకంగా 15 సినిమాలు రిలీజ్ చేయబోతున్నామని చెప్పి మీడియాకే కాదు ప్రేక్షకులకు సైతం షాక్ ఇచ్చారు.

గతంలో రామానాయుడు, అశ్వినీదత్, త్రివిక్రమరావు, అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ల వల్ల కూడా ఇలాంటి ఫీట్ సాధ్యపడలేదు. సంవత్సరానికి అయిదారు చేయడమే గొప్పనుకున్న టైం నుంచి మూడు నాలుగు పూర్తి చేస్తేనే చాలనుకునే స్టేజికి వచ్చారు. దానికి కారణాలు అనేకం. ప్యాన్ ఇండియా బడ్జెట్ లు, హీరో హీరోయిన్ పారితోషికాలు, ఓటిటిల తాకిడి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాంటిది నిర్మాత టిజి విశ్వప్రసాద్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తే అతిశయోక్తి కాదు. ఎందుకంటే రవితేజ లాంటి స్టార్ హీరో వీళ్ళకే వరసగా డేట్లు ఇవ్వడం కన్నా నిదర్శనం ఏముంటుంది.

ఇదిలాగే కొనసాగి మిగిలిన నిర్మాతలు కూడా ఈ స్పీడ్ అందుకుంటే అంతకన్నా ఇండస్ట్రీకి కావాల్సింది ఏముంటుంది. ప్రభాస్ రాజా డీలక్స్ నుంచి శ్రీవిష్ణు స్వాగ్ దాకా పెద్ద నుంచి చిన్న హీరోల దాకా అందరి కాంబోలను క్రేజీగా సెట్ చేసుకుంటోంది పీపుల్స్ మీడియా. గత ఏడాది క్లిష్టమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో బ్రోని ఫాస్ట్ గా తీసి రిలీజ్ చేయడం ఒకరకంగా కేస్ స్టడీ లాంటిది. నిర్మాణాలు ఒకపక్క జరుగుతుండగా వీళ్ళ ఆఫీస్ లో ఓ ఇరవై దాకా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. పవన్ కళ్యాణ్ ఓజి మూవీ డివివి నుంచి తమకే వచ్చిందనే వార్తను పూర్తిగా కొట్టిపారేశారు విశ్వప్రసాద్.