హనుమాన్ దర్శకుడికి వెయ్యి కోట్ల ఆఫర్

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగుతున్న పేరు. హనుమాన్ సినిమాతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచే ప్రశాంత్ వర్మ.. పరిమిత బడ్జెట్లో ‘హనుమాన్’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌లా తీర్చిదిద్దిన తీరు అందరినీ అబ్బురపరిచింది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు చేయడానికి ప్రశాంత్ ప్రణాళికలు రచించుకున్నాడు.

కాగా అతను పురాణ గాథలు తీయడానికి రెడీ అయితే వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత రెడీ అయ్యాడట. ‘హనుమాన్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రశాంత్. అందులో ఒకదాంట్లో అతనీ విషయం వెల్లడించాడు.

పురాణ గాథలతో సినిమాలు తీస్తానంటే వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి తాను సిద్ధం అంటూ ఒక ఎన్నారై తనకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రశాంత్ వెల్లడించాడు. రామాయణం, మహాభారత గాథలను తాను తీయాలనుకున్నానని.. రాజమౌళి మహాభారతం తీస్తానన్నాడు కాబట్టే ఆ ఆలోచన విరమించుకున్నానని.. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి రామాయణం తీయకపోతే తనే తీస్తానని ప్రశాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘హనుమాన్’ మూడొందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండగా.. ‘జై హనుమాన్’ కనీసం ఐదొందల కోట్ల సినిమా అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రశాంత్ వర్మ మాటలు ఇప్పుడు అతిశయోక్తిలా కనిపించినా.. అతడి విజన్ ప్రకారం చూస్తే వెయ్యి కోట్ల సినిమాలు చేసే రోజులు కూడా భవిష్యత్తులో వస్తే ఆశ్చర్యం లేదు. జై హనుమాన్ వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెెక్కే అవకాశముంది.