నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు

రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌గా ఉన్న‌పుడు.. సినీ రంగంలోని వారంతా నంది అవార్డుల‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. వీటి ఎంపిక ప‌క‌డ్బందీగా జ‌రిగేది. అవార్డులు గెలుచుకున్న వాళ్ల ఆనందానికి అవ‌ధులు ఉండేవి కావు. నంది అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు.

కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు. త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. రెండు తెలుగు రాష్ట్రాల పాల‌కుల‌కు నంది అవార్డుల కోసం సినీ పెద్ద‌లు విన్న‌పాలు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

అయితే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే ఈ సినీ అవార్డులను పునరుద్ధరించడానికి అడుగుపడింది. అయితే ఇంతకుముందులా నంది అవార్డులు కాకుండా కొత్త పేరుతో పురస్కారాలు ఇవ్వబోతున్నారు. గత ఏడాది పరమపదించిన విప్లవ నేత, గాయకుడు, నటుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా సినీ అవార్డులు ఇవ్వబోతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటన చేశారు. త్వరలోనే అవార్డుల ప్రక్రియ మొదలవుతుందని ఆయన ప్రకటించారు.

విభజన తర్వాత ఆల్రెడీ నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో కొత్త పేరుతోనే అవార్డులు ఇవ్వక తప్పట్లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరును ఎంచుకున్నారు. మరి ఈ పురస్కారాల పట్ల మిగతా రాజకీయ పక్షాలు, సినీ జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.