మ్యారేజి బ్యాండు నమ్మకం గట్టిదే

వచ్చే వారం ఫిబ్రవరి 2 విడుదల కాబోతున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మీద క్రమంగా ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. ట్రైలర్ ద్వారా ఇందులో ఏం చెప్పబోతున్నారో ముందే స్పష్టత ఇచ్చేయడంతో దానికి తగ్గట్టే హైప్ వచ్చేస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు వేసేందుకు నిర్ణయం జరిగిపోయిందని టాక్. రైటర్ పద్మభూషణ్ కు గత ఏడాది ఇదే తరహాలో షోలు వేస్తే మంచి రెస్పాన్స్ వచ్చి ఓపెనింగ్స్ కి దోహదపడింది. ఆ తర్వాత బేబీ, ఇటీవలే హనుమాన్ కు వీటి వల్ల జరిగిన మేలు చాలానే ఉంది. అందుకే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు సైతం అదే బాట పట్టనుంది.

సుహాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ లోనూ గుర్తింపు ఉంది. దాన్ని పెంచుకునే క్రమంలో విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నాడు. అంబాజీపేట కూడా అదే కోవలోదే. ఆ రోజు చెప్పుకోదగ్గ పోటీ లేకపోయినా మరో మూడు చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. మెల్లగా వాటికి ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. ఆపై వారం రవితేజ ఈగల్, యాత్ర 2 వస్తుండటంతో మొదటి వారం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కి కీలకం కానుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే సెకండ్ వీక్ థియేటర్లకు ఢోకా ఉండదు. సుహాస్ ఊరూరా తిరుగుతూ మరీ పబ్లిసిటీలో భాగమవుతున్నాడు.

దుశ్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాకు ధీరజ్ మొగిలినేని నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 తరఫున బన్నీ వాస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈయనే యాక్టివ్ గా ఇంటర్వ్యూలు గట్రా ఇస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్స్ లో ఉంది. బిజినెస్ ఇంతకీ చేశారో ఇంకా బయటికి రాలేదు కానీ ఏరియాల వారీగా రీజనబుల్ రేట్లకు ఇచ్చారు. బాగుందనిపించుకుంటే చాలు త్వరగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇది కనక సక్సెస్ అయితే మిడ్ రేంజ్ అందుకోవడానికి సుహాస్ కి ఇంకో మెట్టు దొరికినట్టే.