మహేష్- రాజమౌళి కథ రెడీ అయిపోయింది

గుంటూరు కారం సందడి కొనసాగుతుండగానే మహేష్ బాబు అభిమానుల దృష్టి మరో సినిమా మీదికి మళ్ళింది. అది రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే చిత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రెండేళ్ల ముందే ఖరారు కాగా.. సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

రాజమౌళి సినిమా అంటే కథ కోసం ఏడాది.. ప్రీ ప్రొడక్షన్ కోసం ఏడాది.. మేకింగ్ కోసం రెండేళ్లు.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇంకొక ఏడాది సమయం పడుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ఒక అంకం పూర్తి అయింది అన్నది తాజా కబురు.

మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు కథ పూర్తి చేసినట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగితే.. మహేష్ రాజమౌళి సినిమాకు కథ పూర్తి చేసినట్లుగా సింపుల్ గా ఒక మాట చెప్పారు. ఈ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ కథ గురించి ఏడాది కాలంగా విజయేంద్రప్రసాద్ హింట్స్ ఇస్తున్నారు కానీ తొలిసారిగా స్క్రిప్ట్ పూర్తయిన విషయం ఇప్పుడే వెల్లడించారు.

కథ పూర్తయిందంటే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరందుకున్నట్లే. కాబట్టి మరి కొన్ని నెలల్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని రాజమౌళి ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నటినటులు, టెక్నీషియన్ల కలయికతో ఈసారి పక్కా ప్రపంచ స్థాయి సినిమాను అందించబోతున్నాడు రాజమౌళి. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు.