డబుల్ ఇస్మార్ట్ అడుగులు వాయిదా వైపు ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీ మార్చి 8గా ఎప్పుడో లాక్ చేసుకుని అధికారికంగా ప్రకటించారు. వేగంగా తీయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి ఖచ్చితంగా డెడ్ లైన్ ని అందుకుంటాడనే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈసారి సాధ్యం కాకపోవచ్చని వినిపిస్తోంది. ఇంకో నలభై రోజుల దాకా షూటింగ్ పెండింగ్ ఉండటంతో తొందరపడి హడావిడి చేయడం కంటే క్వాలిటీ మిస్ కాకుండా చూడాలని పూరి, రామ్ ఇద్దరూ నిర్ణయించుకోవడంతో పోస్ట్ పోన్ లాంఛనమేనని తెలుస్తోంది. త్వరలో అధికారికం కావొచ్చు.

ఒకవేళ అలా జరిగితే విశ్వక్ సేన్ కి పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఎందుకంటే అదే డేట్ కి గ్యాంగ్స్ అఫ్ గోదావరి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. డిసెంబర్ లోనే రావాల్సి ఉన్నా సలార్ వల్ల హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు ముందుకు వచ్చేయడంతో పాటు చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో తప్పుకున్నాడు. ఇప్పుడు మార్చ్ 8కి ఎలాంటి అడ్డంకులు లేనట్టే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ విలేజ్ డ్రామాని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు బాగా వస్తున్నాయి.

డబుల్ ఇస్మార్ట్ కున్న ఇంకో సమస్య ప్రమోషన్లు. మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చే నెల మూడో వారంలోపే చిత్రీకరణ పూర్తి చేయాలి. ప్రమోషన్లకు ఎంత లేదన్నా నెల రోజులు అవసరం. అంత టైం దొరకదు. పైగా లైగర్ డిజాస్టర్ కి తగిన సమాధానం డబుల్ ఇస్మార్ట్ తో చెప్పాలని పూరి కసితో ఉన్నాడు. స్కంద విషయంలో ఏకంగా ట్రోలింగ్ ని చవి చూడాల్సి వచ్చిన రామ్ కు సైతం ఈ ప్రాజెక్ట్ కీలకం. సంజయ్ దత్ విలనిజం. మణిశర్మ సంగీతం ఇలా బోలెడు ఆకర్షణలున్నాయి. సో ఈసారికి నిదానమే ప్రధానం మంచిదే. సో టీమ్ నుంచి న్యూస్ వచ్చే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.