వ్యూహానికి ‘కోర్టు’ బ్రేక‌ర్లు.. ఎప్ప‌టికి తేలేను?

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయంగా కుదుపున‌కు కార‌ణ‌మైన వ్యూహం సినిమా విడుద‌ల విష‌యం ఇంకా కోర్టు మెట్లు దిగి కిందికి రాలేదు. ఈ సినిమాను గ‌త నెల 29నే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సినిమా యూనిట్ ప్ర‌క‌టించినా.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఇంకా తొలిగిపోలేదు. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును దారుణంగా చిత్రీక‌రించార‌ని ఆరోపిస్తూ.. ఆయ‌న కుమారుడు టీడీపీ నేత నారా లోకేష్ కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

దీనిపై విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ హైకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో న్యాయ‌మూర్తి.. ప్ర‌త్యేకంగా క‌మిటీ వేసుకుని.. దీనిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు. ఈ క‌మిటీలో ఇటు పిటిష‌న‌ర్ త‌ర‌ఫు వారు.. అటు ప్ర‌తివాదులైన చిత్ర యూనిట్, నిర్మాత ఉండాల‌ని పేర్కొంది. అయితే.. కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవ‌చ్చిని కూడా హైకోర్ట్ ఆదేశించింది. దీనిపై వెంట‌నే త‌మ‌కు తేల్చి చెప్పాల‌ని పేర్కొంది.

ఈ చిత్రాన్ని స‌ద‌రు యూనిట్ స‌భ్యులు వీక్షించి.. ఒక నిర్ణ‌యానికి రావాల‌ని.. ఇది ర‌హ‌స్యంగా జ‌ర‌గాల‌ని.. ఎవ‌రి నివేదిక‌ను వారే స్వ‌యంగా కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అయితే.. ఇలా క‌మిటీని ఏర్పాటు చేసి.. వ్యూహం సినిమాను చూపించి క‌మిటీ తీసుకునే నిర్ణ‌యం మేర‌కు సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటామన్న హైకోర్టు వాద‌న‌ల‌ను ఇటు సెన్సార్ బోర్డు, అటు చిత్ర యూనిట్ రెండూ అంగీక‌రించ‌లేదు.

ఇప్ప‌టికే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి స‌ర్టిఫికేట్ కూడా అందించింద‌ని.. ఈ విష‌యంలో క‌మిటీని ఏర్పాటు చేయ‌డం స‌రికాద‌ని ప్ర‌తివాదుల త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టుకు వెల్ల‌డించారు. దీంతో ఈ కేసును ఇప్ప‌ట్లో తేల్చ లేమని కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఫ‌లితంగా వ్యూహం సినిమాకు ఎదురైన న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఇప్ప‌ట్లో తొలిగిపోయేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.