రాక్షసుల ప్రపంచంలో పోలీస్ ‘భీమా’

మాచో స్టార్ గోపీచంద్ గత కొన్నేళ్లుగా సక్సెస్ దూరమై ఇబ్బంది పడుతున్నాడు కానీ సరైన కంటెంట్ పడితే హిట్టు కొట్టే రేంజ్ లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భీమా మీద అభిమానులకు మంచి అంచనాలున్నాయి. ఏ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం లాంటి బలమైన సాంకేతిక మద్దతుతో బరిలో దిగుతున్న భీమా వచ్చే నెల ఫిబ్రవరి 16 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ టీజర్ ని విడుదల చేసింది. కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.

అదో విచిత్ర ప్రపంచం. చుట్టూ కొండలు, గుహలు తప్ప మనం చుట్టూ చూసే వాతావరణం అక్కడ ఉండదు. రాక్షసుల్లాంటి మనుషులదే రాజ్యం. పూజలు, హోమాల పేరుతో అక్కడ అరాచకం రాజ్యమేలుతూ మహిళలు, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇదేంటని ప్రశ్నించే నాథుడు ఉండడు. ఆ సమయంలో ఖాకీ దుస్తులతో వస్తాడు భీమా(గోపీచంద్). దున్నపోతు మీద వచ్చి మరీ వీళ్ళ భరతం పట్టేందుకు కంకణం కట్టుకుంటాడు. ఇంతకీ సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఉన్న ఆ అడవి గుహల్లో జరుగుతోంది ఏమిటి, భీమా ఎందుకొచ్చాడనేదే స్టోరీ.

విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్ గా సెట్ చేయడంతో రెగ్యులర్ పోలీస్ స్టోరీ అనే ఫీలింగ్ కలగకుండా చేయడంలో హర్ష సక్సెస్ అయ్యాడు. గోపిచంద్ ని కొన్ని సెకండ్లకే పరిమితం చేసి అసలు మ్యాటర్ ని ట్రైలర్ ని రివీల్ చేసేందుకు ప్లాన్ చేశారు. నేపధ్య సంగీతం, కెమెరా పనితనంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సైతం ప్రాధాన్యత ఇచ్చారు. ప్రియా భవాని శంకర్-మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న భీమాలో నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర తారాగణం. వీళ్లెవరినీ టీజర్ లో చూపించలేదు.