సైంధవ్ అంటే కిల్లింగే కాదు కన్నీళ్లు కూడా

విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ వన్ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ చాలా చేశారు కానీ రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా తరహా కుటుంబ చిత్రాలతో తన ఫ్యాన్ బేస్ ని అమాంతం పెంచేసుకున్నారు. ఈ కారణంగానే రానా నాయుడు వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ని ఎంత మాత్రం ఒప్పుకోలేదు. విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయంటే స్వయంగా వెంకీనే సెకండ్ సీజన్ కి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పే దాకా. ఇక సైంధవ్ విషయానికి వద్దాం.

టీజర్, ట్రైలర్ చూశాక సైంధవ్ లో పక్కా ఊర మాస్ యాక్షన్ ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే జరిగిన లాంచ్ ఈవెంట్ లో వెంకీ ఎమోషన్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత వెంకట్ బోయినపల్లి మరింత స్పష్టత ఇచ్చారు. సైంధవ్ చూశాక మీకు కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయని, ఒకవేళ అలా జరగకపోతే నాగవంశీ లాగా టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చే ప్రామిస్ చేయను కానీ కొత్త కర్చీఫ్ కొనిస్తానని అంటున్నారు. ఊరికే మాట వరసకు అంటే ఏదో అనుకోవచ్చు. హీరో ప్రొడ్యూసర్ ఇద్దరూ ఒకే మాట అనడం చూస్తే బలమైన భావోద్వేగాలు ఉన్నట్టే.

పోటీలో ఉన్న గుంటూరు కారం, నా సామిరంగ, హనుమాన్ లతో పోల్చుకుంటే సైంధవ్ లో ఉన్న కంటెంట్ ఎక్కువ యాక్షన్ లవర్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. పాప జబ్బు, దాని చుట్టూ అల్లిన సెంటిమెంట్, చిన్నారి తల్లి పాట ఇవన్నీ ఊహించని రేంజ్ లో తెరమీద పండుతాయని మేకర్స్ అంటున్నారు. ఇది నిజమైతే మాత్రం క్లాస్ మాస్ ఇద్దరికీ దగ్గరయ్యే అవకాశం సైంధవ్ కు ఉంటుంది. దర్శకుడు శైలేష్ కొలను క్రమం తప్పకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ విశేషాలు పంచుకుంటూనే ఉన్నాడు. ఈగల్ తప్పుకోవడంతో జనవరి 13న వెంకీకి ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది. దాన్ని వాడుకోవడమే మిగిలింది.