రూటు మారుస్తున్న వీరమల్లు దర్శకుడు

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సరైన బ్లాక్ బస్టర్ పడిందా దశ తిరిగిపోతుంది. హరిహర వీరమల్లు ఆఫర్ ఒప్పుకున్నప్పుడు క్రిష్ ఫీలింగ్ ఇదే అయ్యుంటుంది. కానీ జరిగింది వేరు. షూటింగ్ లో విపరీతమైన జాప్యం, సెట్లు కూలిపోవడం, పవన్ జనసేనలో బిజీగా కావడం, వేగంగా ఓ రెండు రీమేకులు చేయాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ గ్యాప్ లోనే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తీశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో పేరు రాలేదు సరికదా అసలది క్రిష్ తీసిన విషయమే ఆడియన్స్ మర్చిపోయారు.

ఇంకో వైపు వెబ్ సిరీస్ లకు టర్న్ తీసుకుని తన ఆధ్వర్యంలోనే వేరే దర్శకుడితో ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా 9 అవర్స్ తీయించారు. చనిపోక ముందు తారకరత్న నటించిన మొదటి మరియు చివరి సిరీస్ ఇదే. తర్వాత కన్యాశుల్కం ఆధారంగా అంజలి-అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో శేష సిందూరావు డైరెక్షన్ లో ఇంకో సిరీస్ పూర్తి చేశారు. ఇలా టైం వేస్ట్ కాకుండా వీలైనంత బిజీగా ఉంటున్నారు కానీ మెగా ఫోన్ చేపడితే వచ్చే ఆనందం, సంతృప్తి నిర్మాణంలో రాదు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్ధం చేసుకుని హీరోయిన్ కోసం చూస్తున్నారట.

మొదటి ఆప్షన్ గా వేదంలో చేసిన అనుష్క, రెండో ఛాయస్ గా కృష్ణం వందే జగద్గురుంలో నటించిన నయనతారను అడిగే ఆలోచనలో ఉన్నారట. స్వీటీ చిరంజీవి విశ్వంభరనే చేయాలో వద్దో తేల్చుకోలేని అయోమయంలో ఉంది. అలాంటప్పుడు క్రిష్ చెప్పే కథ మీద ఆసక్తి చూపించడం అనుమానమే. ఇక నయనతార రెమ్యునరేషన్ తట్టుకోవాలంటే బడ్జెట్ భారీగా ఉండాలి. కానీ కమర్షియల్ గా తమిళంలో తప్ప తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు. సో ఇవన్నీ లెక్కలు వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా వీరమల్లుకి ఇంకో ఏడాది పట్టేలా ఉంది.