చిరు వెంకీ మల్టీస్టారర్ మాటవరసకేనా

ఇటీవలే జరిగిన వెంకటేష్ 75 ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి తామిద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ రావాలని కోరుకుంటున్నట్టు, వెంకీ ఒక లైన్ చెప్పినట్టు అన్న మాటలు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చాయి. చిరు ముందుండి కమాండ్ చేస్తే విక్టరీ వెనుక నుంచి నరుక్కుంటూ వచ్చేలా ఉంటుందని హింట్ ఇస్తే అభిమానులు నిజమేనని అనుకున్నారు. వెంకీ సైతం మీరు చూస్తూ ఉండండి ఆ సినిమా వస్తుందని ఊరించారు. నిజానికి ఇన్ సైడ్ టాక్ ఏంటంటే ఏదో ఫ్లోలో తమ మనసులో మాట చెప్పుకున్నారు కానీ అలాంటి ప్రతిపాదనేది అసలు లేనే లేదట.

మూడు దశాబ్దాలకు పైగా సుధీర్ఘమైన స్నేహం ఉన్న ఈ సీనియర్ అగ్ర హీరోలు ఇప్పటిదాకా కలిసి నటించలేదు. ఒక్క త్రిమూర్తులు స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించడం తప్ప మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. అభిమానుల అంచనాలు అందుకోలేమనే భయమో లేక పాత్రల ప్రాధాన్యం పరంగా న్యాయం జరగదన్న భావనో ఏదైతేనేం మూవీ లవర్స్ కోరిక నెరవేరలేదు. పోనీ ఆరు పదుల వయసులు దాటాక సాధ్యమైతే చూద్దామనుకుంటే అలాంటి కథలు రాసే రచయితలు లేరన్నది హీరోల కంప్లయింట్. సో ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు.

మంచి స్టోరీ దొరికితే మొదటి గ్రీన్ సిగ్నల్ వెంకటేష్ వైపు నుంచే చూడొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, రామ్ మసాలా ఇలా మల్టీస్టారర్లలో భాగమయ్యారు. ఇప్పుడు చిరుతో అంటే నో చెప్పే ఛాన్స్ ఉండదు. అయితే ఎంత టైం పడుతుందనేది మాత్రం చెప్పలేం. హిమాలయాలకు వెళ్లాలనుకున్న వాడిని ఖైదీ నెంబర్ 150 సక్సెస్ చూశాక నటనకి విరామం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానని చెప్పిన వెంకీ ప్రత్యేకంగా చిరంజీవికి వేదిక మీద థాంక్స్ చెప్పారు. కాబట్టి ఇది స్పీచుల దగ్గరే ఆగిపోకుండా కార్యరూపం దాల్చాలి.