వర్మవి పిచ్చి సినిమాలు..పరువు పోతోంది: తమ్మారెడ్డి

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వివాదాస్పద దర్శకుడిగా నెటిజన్లు పిలుచుకునే వర్మ తాజాగా తీసిన సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. శివవంటి సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వర్మ….ఇపుడు తన స్థాయిని దిగజార్చే చెత్త సినిమాలు తీసి పరువు పోగొట్టుకుంటున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

పరువు హత్యల నేపథ్యంలో వర్మ దర్శకత్వం వహిస్తోన్న మర్డర్ చిత్రంపై అమృత ప్రణయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా, వర్మపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పిచ్చి సినిమాలు తీస్తున్న వర్మ…తన పరువుతో పాటు ఇండస్ట్రీ పరువు కూడా తీస్తున్నాడని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

పలువురు ప్రముఖుల మీద సెటైరికల్ గా సినిమాలు తీసే వర్మపై రాంగ్ గోపాల్ వర్మ..అనే చిత్రాన్ని ప్రముఖ సినీ జర్నలిస్టు ప్రభు తెరకెక్కిస్తున్నారు. రైట్ డైరెక్టర్ ఇన్ రాంగ్ వే అనే క్యాప్షన్ ఉన్న ఈ చిత్రంలోని ఓ పాటను తమ్మారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కల్యాణ్ మీద సినిమాలు తీసే వర్మ వంటి వారిని కానీ, వర్మ మీద సినిమాలు తీసేవారిని కాని తాను ఛీ అంటానని అన్నారు. కానీ, ఎవరిష్టం వారిదని, అది వ్యాపారమని, ఇది తప్పనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఈ సినిమా దర్శకుడు ప్రభుకు ఇది తొలి చిత్రమని, ప్రభు తనకు తమ్ముడు వంటి వాడని, ఈ టైప్ సినిమాలు నీకెందుకురా అని వారించానని అన్నారు.

అయితే, ప్రభు చెప్పింది నిజమేనని, వర్మ నిజంగా ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలుగు వారికి గౌరవం తెచ్చిన దర్శకుడు వర్మ ఈ రోజు ఇంత దయనీయమైన స్థితిలో ఉండడం చూసి బాధపడుతున్నానని తమ్మారెడ్డి చెప్పారు. వర్మకు ఈ పరిస్థితి రావాల్సింది కాదని, గతంలో గొప్ప సినిమాలు తీసి టాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన వర్మపై ఈ రోజు వేరొకరు సెటైరికల్ సినిమాలు తీసే స్థాయికి రావడం బాధాకరమన్నారు.

ఇకనైనా, వర్మ.కళ్లు తెరిచి మంచి సినిమాలు తీయాలని, వర్మ మంచి సినిమాలు తీశాడని ప్రభు వంటి జర్నలిస్టులు మెచ్చుకోవాలని అన్నారు. ప్రభు లాంటి దర్శకులు వర్మను తిడుతూ సినిమాలు తీయకుండా ఉండేలా వర్మ మారాలని తమ్మారెడ్డి ఆకాంక్షించారు.