మారుతున్న అల్లు అర్జున్ ప్రాధాన్యం

ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ ని ఒక యజ్ఞంలా రెండేళ్లుగా తీస్తున్న దర్శకుడు సుకుమార్ కోసం అల్లు అర్జున్ ఎంత సమయం ఖర్చవుతోందో చూసుకోవడం లేదు. మొదటిసారి ఒక తెలుగు హీరోకి జాతీయ అవార్డు వచ్చేలా చేసిన సుక్కుని ఇంతగా నమ్మడం మంచిదే. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న ఈ క్రేజీ సీక్వెల్ కోసం భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడప్పుడే తొందరపడేలా లేదు. దీని సంగతలా ఉంచితే బన్నీ చేయాల్సిన డైరెక్టర్ల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలు అఫీషియల్ గా ఉన్నారు.

ఈలోగా బన్నీ ప్రాధాన్యతలు మారిపోయినట్టు లేటెస్ట్ అప్డేట్. పుష్ప 2 కాగానే అట్లీతో ప్రాజెక్టుని సెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. ప్రాధమికంగా కథకు సంబంధించిన చర్చలు జరిగాయని, ఫైనల్ వెర్షన్ ఇద్దరు కలిసి చర్చించుకున్నాక ఎప్పుడు మొదలుపెట్టాలనేది డిసైడ్ చేస్తారట. మరి షారుఖ్ ఖాన్ తో జవాన్ తర్వాత అట్లీ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా సంగతి ఏంటంటే అసలు దానికింకా స్టోరీనే రెడీగా లేదట. కేవలం ఒక లైన్ అనుకున్నారు తప్పించి బాద్షా నుంచి అంగీకారం రాలేదని తెలిసింది. అదే టైంలో ఐకాన్ స్టార్ తో సెట్ అయ్యేలా ఉండటంలో అట్లీ ఇటు షిఫ్ట్ అయ్యుండొచ్చు.

త్రివిక్రమ్ విషయానికి వస్తే గుంటూరు కారం రిలీజయ్యాక నానితో ఒక మూవీ ఉండొచ్చనే వార్త ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. సో బన్నీ స్క్రిప్ట్ కి టైం పడుతుందంటే ఇది సెట్స్ పైకి వెళ్లొచ్చు. సందీప్ రెడ్డి వంగా ముందు ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత యానిమల్ పార్క్ ఉంది. ఈ రెండూ అయ్యాకే బన్నీ కోసం పెన్ను పట్టుకుంటాడు. ఇవన్నీ సమయాన్ని డిమాండ్ చేసేవి. అల్లు అర్జున్ కోసం అట్లీ రాసుకున్న సబ్జెక్టు కమర్షియల్ గానే ఉన్నప్పటికీ పుష్ప ఇచ్చిన ఇమేజ్ ని రెట్టింపు చేసే రేంజ్ లో వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇంత క్రేజీ కాంబోల కన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది.