30 లక్షల టికెట్లంటే నిజంగా భీభత్సమే

సలార్ ఇంకా మొదటి షో పడకుండానే బాక్సాఫీస్ కు భీభత్సం స్పెల్లింగ్ రాయిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డులు సృష్టించి రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ఇంకా పన్నెండు గంటలు సమయం మిగిలి ఉండగానే దేశవ్యాప్తంగా 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయి ట్రేడ్ మతులు పోగొట్టింది. వీటిలో పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లు లేవు. డంకీకి సంబంధించిన స్క్రీన్ల పంపకాల్లో చూపించిన అసమానత కారణంగా హోంబాలే ఫిలింస్ వాటికి కంటెంట్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. ఇష్యూ ఇప్పటికైతే పరిష్కారం కాలేదు.

ఆంధ్రప్రదేశ్ 13 లక్షల 25 వేలు, తెలంగాణ 6 లక్షలు, ఉత్తరాది రాష్ట్రాలు 5 లక్షల 25 వేలు, కర్ణాటక 3 లక్షల 25 వేలు, కేరళ 1 లక్ష 50 వేలు, తమిళనాడు 1 లక్ష టికెట్లతో ఇంకా ట్రెండ్ ని పైకి తీసుకెళ్లే పనిలో ఉంది. వీటిలో కరెంట్ బుకింగ్స్ జరిగే చాలా సింగల్ స్క్రీన్లను కలపలేదు. బిసి సెంటర్లలో ఆన్ లైన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ స్వయంగా ఈ ఫిగర్లను ప్రకటించడం గమనించాల్సిన విషయం. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలవుతున్న తరుణంలో మూవీ ఎలా ఉండబోతోందనే అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇది ఊహించిన స్పందనే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాస్తవం. మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. రెండో ట్రైలర్ మొత్తం సీన్ నే మార్చేసింది. ఒక్కసారిగా మాస్ వర్గాల్లో ఎక్కడ లేని హైప్ వచ్చింది. ప్రభాస్ ఇమేజ్, కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన మూవీ కావడం, వందల కోట్ల బడ్జెట్ ఇవన్నీ బజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతి వచ్చేదాకా ఇరవై రోజుల పాటు సలార్ ప్రభంజనం మాములుగా ఉండదు. బ్లాక్ బస్టర్ అయితే మాత్రం పండగ టైంలోనూ కొనసాగించే అవకాశాలు కొట్టిపారేయలేం.