బాలీవుడ్ విమర్శకుల మీద సందీప్ వంగా పంచులు

యానిమల్ రూపంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. క్రేజీ ఆఫర్లతో ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నా ముందే చేసుకున్న కమిట్ మెంట్ ప్రకారం ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ మూడూ టి సిరీస్ నిర్మాణ భాగస్వామ్యంలోనే చేయబోతున్నాడు. ఈ మేరకు నిన్న భూషణ్ కుమార్ తో కలిసి అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సందీప్ వంగా తాజాగా ఒక హిందీ ఇంటర్వ్యూలో ముంబై రివ్యూయర్లు, క్రిటిక్స్ ని ఓ రేంజ్ లో ఎటాక్ చేశాడు.

దీనికి కారణం ఉంది. కబీర్ సింగ్ రిలీజయ్యాక మొదటి రోజే ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ సినిమాను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. అందులో హీరో క్యారెక్టరైజేషన్ గురించి. హీరోయిన్ పాత్ర డిజైన్ గురించి ఏవేవో క్లాసులు తీసుకున్నారు. ఒకటి రెండు రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగు వెర్షన్ బ్లాక్ బస్టరని తెలిసి కూడా ఇలా టార్గెట్ చేసిన వైనం స్పష్టంగా కనిపించింది. అయితే జనం వీటిని పట్టించుకోలేదు. కబీర్ సింగ్ ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలచి నిద్రపోతున్న షాహిద్ కపూర్ కెరీర్ ని పరుగులు పెట్టించింది.

తాజాగా సందీప్ వంగా అవన్నీ గుర్తు పెట్టుకుని తిరిగి ఇచ్చేశాడు. తన సినిమా గురించి గతంలో కొందరు ఏ మాత్రం అర్హత లేని నిరక్షరాస్యులు కంటెంట్ గురించి కామెంట్ చేశారని, వాళ్ళు అంత దారుణంగా తిట్టిపోయడం వల్లే గొప్ప సక్సెస్ అందుకున్నాని వెటకారంగా కౌంటర్ వేశాడు. ఏ సినిమా గురించి అయినా సహేతుకంగా విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది కానీ కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియా వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. ఇప్పుడు అదే బృందం యానిమల్ ని ఏమనలేక ఎనిమిది వందల కోట్లు దాటడం చూసి మౌనంగా ఉంది. విజయం తాలూకు దెబ్బ మరి.