రవితేజ జోడి అందుకే ఆలస్యమయ్యింది

మాస్ మహారాజా రవితేజ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాని మొన్న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎన్నికల వల్ల పెద్ద బ్రేక్ వచ్చేయడంతో ఈ లోగా తన మిరపకాయ్ హీరోతో సెట్ చేసుకున్నాడు హరీష్ శంకర్. అయితే హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు జరిగిన మాట వాస్తవం. పూజా హెగ్డే, రష్మిక మందన్నను అడిగితే వాళ్ళు నో చెప్పారని ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో తిరిగాయి. వాటిని స్వయంగా డైరెక్టరే ఖండించాడు. ఫైనల్ గా బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే లాకయ్యిందని టాక్.

అసలు ఇంత కసరత్తు జరగడానికి కారణం ఉంది. ఈ చిత్రం బాలీవుడ్ మూవీ రైడ్ రీమేకనే సంగతి యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా నమ్మశక్యంగా లీకుల ద్వారా ఇప్పటికే కన్ఫర్మేషన్ ఉంది. ఒరిజినల్ వెర్షన్ లో అజయ్ దేవగన్ జోడిగా ఇలియానా చేసింది. కథ మొత్తం హీరో విలన్ మధ్య జరుగుతుంది. సో భార్య పాత్రకు ప్రాధాన్యం మరీ ఎక్కువగా ఉండదు. అలాంటప్పుడు ఫామ్ లో ఉన్న భామలు ఓకే చెప్పడం కుదరదు. భాగ్యశ్రీకి ఆ సమస్య లేదు. యారియా 2లో నటించింది కానీ అదేమంత పేరు తీసుకురాలేదు. ఏదో ఒక్క బ్రేక్ దక్కితే టాలీవుడ్ లో అడుగులు పెట్టొచ్చని ఆశ.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ మనీ థ్రిల్లర్ లో విలన్ గా ఎవరు ఉంటారనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇది చాలా ముఖ్యమైన క్యారెక్టర్. హీరో ఐటి దాడులు చేశాక డ్రామా మొత్తం ఇతనితోనే ముడిపడి ఉంటుంది. అక్కడ సౌరభ్ శుక్లా అద్భుతంగా పండించారు. ఇక్కడెవరు చేస్తారో చూడాలి. ఈగల్ విడుదల కోసం ఎదురు చూస్తున్న రవితేజ దాని విడుదల కాగానే హరీష్ శంకర్ కు వరుసగా డేట్లు ఇవ్వబోతున్నాడు. తక్కువ షెడ్యూల్స్ లో వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఏప్రిల్ లోపు గుమ్మడికాయ కొట్టేస్తే హరీష్ తిరిగి భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్ళిపోతాడు