అర్ధరాత్రి 1 గంటకు సలార్ ఆగమనం

సలార్ వచ్చే ఘడియలు దగ్గరవుతున్నాయి. ఇంకొక్క వారం ఎదురు చూస్తే ప్రభాస్ ఊర మాస్ యాక్షన్ ట్రీట్ ని చూసేందుకు అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో చాలా కాలంగా మిడ్ నైట్ షోలు వేయడం లేదు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు వేసుకోవడానికి అనుమతులు ఇస్తూ వచ్చారు. ఆర్ఆర్ఆర్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి లాంటివి వాడుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. అయితే సలార్ కు డిసెంబర్ 21 అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు షోలు వేసుకోవడానికి అనుమతులు వచ్చినట్టు ట్రేడ్ టాక్. బుకింగ్స్ ఇంకా ఇవ్వలేదు.

హైదరాబాద్ ప్రముఖ సింగల్ స్క్రీన్లు సంధ్య 70, భ్రమరాంబ, మల్లికార్జున, గోకుల్, శ్రీరాములు, దేవి, సుదర్శన్ లతో పాటు కొన్ని ప్రధాన మల్టీప్లెక్సుల్లో ప్రీమియర్లు వేసుకునేందుకు పర్మిషన్లు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. తర్వాత నాలుగు గంటల ఆట కొనసాగుతుంది. ఈ లెక్కన మొదటి రోజు ఆరు లేదా ఏడు షోలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన కేంద్రాల్లో ప్రదర్శనలు ఉంటాయి. అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి వచ్చే జిఓ చూశాక పూర్తి క్లారిటీ వస్తుంది. అభిమానులు మాత్రం అప్పుడే టికెట్ల కోసం రికమండేషన్లు, సెలబ్రేషన్స్ తదితర ఏర్పాట్లలో ఉన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిర్మాతలు అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఏ విషయం సోమవారానికి కానీ తేలక పోవచ్చు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వంద రూపాయల వరకు ఛాన్స్ ఉండగా ఏపీలో మాత్రం యాభైకే పరిమితం కావొచ్చని ఇన్ సైడ్ టాక్. దగ్గరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సినిమాలకు సంబంధించి జగన్ సర్కార్ అవలంబించబోయే ధోరణి ఎలా ఉంటుందనేది ఊహకందటం లేదు. డిసెంబర్ 22 పూర్తిగా తెల్లవారకుండానే సలార్ టాక్ పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ప్రీ రిలీజ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా వినిపిస్తోంది. అంచనాలు నిలబెట్టుకుంటే సునామినే.