డబుల్ ఆఫర్లతో తెలుగులో త్రిష పునఃప్రవేశం

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిష తర్వాత అవకాశాలు తగ్గిపోయి పూర్తిగా తమిళంకే అంకితమైపోయింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చూశాక జనాల అభిప్రాయాలు మారిపోయాయి. పదిహేనేళ్ల కెరీర్ తర్వాత కూడా త్రిష ఇంత అందంగా నటించడం చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. విజయ్ లియోలో ఏరికోరి ఆమెను తీసుకోవడానికి కారణం ఇదే. అజిత్ సరసన ఆఫర్ కొట్టేసింది. సోలోగా నటించే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పుడు తన కాంబో కోరుకుంటున్న వాళ్ళలో తెలుగు స్టార్లు కూడా ఉన్నారు.  

చిరంజీవి విశ్వంభరలో త్రిష హీరోయిన్ కావడం కన్ఫర్మే. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ త్వరలోనే ప్రకటన ఇచ్చేందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్ తో షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న త్రిష తిరిగి రాగానే డేట్ల సర్దుబాటుని బట్టి డేట్స్ ప్లాన్ చేస్తారు. గతంలో ఈ కాంబోలో స్టాలిన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు నవీన్ తో చేయబోయే మూవీకి కూడా త్రిషనే అనుకుంటున్నారట. లవ్ యాక్షన్ రొమాన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

అధికారికంగా చెప్పకపోయినా ఈ రెండు ఫిక్స్ చేసుకున్నట్టే. నిజానికి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ఇంత స్పీడ్ గా ఉంటుందని త్రిష ఊహించి ఉండదు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న సాటి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే తను మాత్రం ఇంకా టాప్ డిమాండ్ లో ఉండటం అనూహ్యమే. నాగ్ త్రిషల కలయిక కింగ్ గొప్ప విజయం సాధించకపోయినా అందులో కామెడీని ఇప్పటి జనాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తిరిగి మళ్ళీ కలుసుకోవడం ఫ్యాన్స్ కి శుభవార్తే. ప్రస్తుతం నా సామి రంగా, తర్వాత ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలతో నాగ్ బిజీగా ఉన్నాడు.