మనోజ్ ఉస్తాద్ వెనుక పెద్ద ప్లానింగ్

ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొన్న ఓటిటి రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు అడుగులు వేస్తున్న ఈటీవీ విన్ ఇటీవలే మంచు మనోజ్ తో ఉస్తాద్ అనే సెలబ్రిటీ గేమ్ షోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దీని విశేషాలను ఇటీవలే పంచుకున్న ఈ హీరో సినిమాల కన్నా ముందు ఈ షో తనకు కంబ్యాక్ గా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాడు. దానికి తగ్గట్టే ఫస్ట్ సిరీస్ అతిధులుగా న్యాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, అడవి శేష్ లాంటి క్రేజీ సెలబ్రిటీలను తీసుకొచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీనికి మంచి బడ్జెట్ కేటాయిస్తోంది.

ఆడియన్స్ కి దగ్గరవ్వడానికి మనోజ్ కిది మంచి ఛాన్స్. గతంలో అక్కయ్య మంచు లక్ష్మిప్రసన్న ఇలాంటి కార్యక్రమమే చేసి సక్సెస్ అయ్యింది. మేము సైతం లాంటి ఛారిటీ షోని విజయవంతంగా నడిపించింది. ఇప్పుడు మనోజ్ సీన్ లోకి వచ్చాడు. అయితే ఇది ఊరికే ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుని పంపించే ఇంటర్వ్యూ కాదు. గేమ్స్ ఆడిస్తారు. గెలిచిన సొమ్ములతో అవసరంలో ఉన్న అభిమానులకు సహాయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఇలా కొత్త ఫార్మాట్ లో డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. మనోజ్ ఈ ప్రోగ్రాం ఒప్పుకోవడం వెనుక తెలివైన ప్లానింగ్ కనిపిస్తోంది.

మనోజ్ త్వరలో రెండు సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాటిలో మొదటిది వాట్ ది ఫిష్. గ్యాప్ వచ్చేయడంతో వీటికి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. గ్రౌండ్ లెవల్ లో మనోజ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ అది కలెక్షన్లుగా మారాలంటే ముందు తను జనాలకు బాగా దగ్గరవ్వాలి. ఇదే ఈటీవీ విన్ తో పీపుల్స్ మీడియా వెన్నెల కిషోర్ తో ఓ టాక్ షో చేయించింది. అంతగా వర్కౌట్ కాలేదు. దానికి సతీసమేతంగా గెస్టుగా వచ్చినప్పుడే మనోజ్ తో గేమ్ షో ప్రతిపాదన తేవడం, తను ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. ఉస్తాద్ కనక సక్సెస్ అయితే ఈటీవీ విన్ కి మంచి బూస్ట్ వచ్చినట్టే.