మల్టీప్లెక్సులో మందు తాగే బారు

అదేంటి మాములుగా బారు, ఇల్లు కాకుండా బయట మందు తాగితేనే చట్టం తప్పంటుంది అలాంటిది థియేటర్ లో అంటే ఊహించుకోవడం కష్టమే. అదిప్పుడు నిజమయ్యింది. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఉన్న జియో వరల్డ్ ప్లాజాలో 6 స్క్రీన్ల సముదాయాన్ని తాజాగా ప్రారంభించింది. మొత్తం 790 సీట్లు, ఖరీదైన ఇంటీరియర్స్ తో దేశంలోనే ఖరీదైన అనుభూతికి రంగం సిద్ధం చేసింది. వీటిలో లేజర్ టెక్నాలజీ కూడిన అత్యాధునిక ఐమ్యాక్స్ తెర కూడా ఉంది. ఇండియాలోనే మొదటిసారి అనిపించే విశేషాలు చాలా ఉన్నాయి.

వాటిలో మొదటిది బార్ అండ్ లాంజ్ ఏర్పాటు. గత ఏడాది భారతదేశపు టాప్ మిక్సాలాజిస్ట్ (మిశ్రమ నిపుణుడు) గా పేరు తెచ్చుకున్న శాంతను చందా ప్రత్యేకంగా తయారు చేసిన కాక్ టైల్స్ ని ఇక్కడ సేవించవచ్చు. ఇంతే కాదు ఈ మల్టీప్లెక్స్ లో మాములు ఆహరం దొరకదు. టాప్ సెలబ్రిటీ చెఫ్స్ సారా టాడ్, విక్కీ రత్నాని, యుటాకా సైటో, మయాంక్ తివారి తయారు చేసిన ప్రత్యేక మెనూ ద్వారా ఎంపిక చేసిన ఆహార పదార్థాలు సర్వ్ చేస్తారు. లైవ్ కుకింగ్ కౌంటర్ ఉంటుంది. అంటే మనం చూస్తుండగానే మన సూచనల ప్రకారమే ఖచ్చితమైన పద్ధతుల్లో వండి వడ్డించడం జరుగుతుంది.

యానిమల్ ప్రదర్శనతో ఈ మల్టీప్లెక్స్ మొదలైపోయింది. ఓ రెండున్నర గంటల సినిమాలు చూసేందుకు కొనే టికెట్ కన్నా నాలుగైదింతలు ఎక్కువ ఖర్చు ఫుడ్డు కోసం పెట్టాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా మందు జోడించడం అంటే ఇదేదో ప్రీమియర్ ఆడియన్స్ తప్ప మాములు వాళ్ళు భరించే వ్యవహారం కాదిది. ఎందుకంటే ఒక్క టికెట్ ధర గరిష్టంగా రెండు వేల రూపాయలకు పైగానే ఉంటుంది. అన్నట్టు ఇప్పటిదాకా చూడని ప్రత్యేక 3డి స్క్రీన్లు సైతం వీటిలో అమర్చారట. హైదరాబాద్ లు ఇలాంటివి రావాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ టికెట్ ధరల పాలసీ వల్ల ఇప్పట్లో అయితే జరగదు.