ఫలితాల హంగామాలోనూ థియేటర్లు ఫుల్

తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ జనాలందరూ టీవీ సెట్లకు అతుక్కుపోయి మరీ గెలుపు ఎవరిని వరిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ అధిపత్యంగా స్పష్టంగా కనిపిస్తుండగా బిఆర్ఎస్ ఊహించిన దాని కన్నా తక్కువ స్థాయిలో నిలవడం అందరికీ షాక్ కలిగిస్తోంది. ఏపీలోనూ ఈ పరిణామాల పట్ల సాధారణ జనాలు తీవ్ర పరిశీలన చేస్తున్నారు. దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఈ హడావిడి కొత్త సినిమాల థియేటర్ల కలెక్షన్ల మీద ఏమంత ప్రభావం చూపించడం లేదని అర్థమైపోతోంది. ముఖ్యంగా బాక్సాఫీస్ ని పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకున్న యానిమల్ ఇవాళ కూడా రచ్చ చేస్తోంది.

ప్రధాన కేంద్రాలతో పాటు బిసి సెంటర్స్ లోనూ రన్బీర్ వీరంగం జోరుగా ఉంది. ఆదివారం కావడంతో ముఖ్యమైన థియేటర్లన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అవుతున్నాయి. కౌంటర్ల దగ్గరకు వెళ్లినవాళ్లకు ముందు వరస సీట్లు తప్ప టికెట్లు దొరికే పరిస్థితి లేదు. హైదరాబాద్ లో ఇవాళ కూడా ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచే షోలు ప్రారంభిస్తున్నారు. మూడున్నర గంటల నిడివి కావడంతో ఎక్కువ షోలు వేసుకోవాలంటే వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ప్రతి ఆటకు కనీసం పావు గంట గ్యాప్ లేనిదే క్లీనింగ్ చేసుకోవడం కష్టం. కొన్ని చోట్ల అది కూడా సాధ్యం కాక వదిలేస్తున్నారు.

ఇవాళ ఏపీ తెలంగాణలో యానిమల్ లాభాల్లోకి అడుగు పెట్టే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మొదటిరోజే సగానికి పైగా షేర్ రూపంలో రాబట్టిన యానిమల్ కేవలం మూడు రోజులకే ఇంత పెద్ద ఫిగర్లు నమోదు చేయడం ఊహించని పరిమాణం. 15 కోట్లకు కొన్న దిల్ రాజుని మొదట రిస్క్ అనుకున్నారు కానీ ఇప్పుడాయనకు రాబోయే లాభాలు చూస్తే ఇతర డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర దూరం కావడం ఖాయం. అయితే ఈ జోరు రేపటి నుంచి ఏ స్థాయిలో కొనసాగుతుందనేది కీలకంగా మారుతుంది. ఒకవేళ డ్రాప్ కనక 40 శాతం లోపే ఉంటే జవాన్, పఠాన్ రికార్డులు ఎగిరిపోవడం ఖాయమే.