చిరంజీవితో రావిపూడి మరో చంటబ్బాయా

దసరాకు బాలకృష్ణతో భగవంత్ కేసరి రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. నిర్మాత దిల్ రాజు ఎప్పటి నుంచో తన అభిమాన హీరోల్లో ఒకరైన చిరుతో చేయాలని ట్రై చేస్తూ ఉంటే యాభయ్యో సినిమాకు ఆయన కొడుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కుదిరింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ అయినట్టు తెలిసింది. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. లైన్ నచ్చింది, ఫైనల్ వెర్షన్ విన్నాక ఎప్పుడు మొదలుపెట్టాలనేది డిసైడ్ చేస్తారట. లాక్ చేసుకున్నాకే అధికారిక ప్రకటన వస్తుంది.

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు అపజయమే ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ కంటే ఎక్కువ కామెడీతో మెప్పించే ఈ యంగ్ టైగర్ నుంచి చంటబ్బాయి లాంటి ఎంటర్ టైనర్ ని ఫ్యాన్స్ ఆశిస్తారు. అయితే మాస్ క్లాస్ ని రెండూ హ్యాండిల్ చేయడంతో రావిపూడి అనుభవం సరిలేరు నీకెవ్వరుతోనే ప్రూవ్ అయ్యింది కాబట్టి పెద్దగా అనుమానాలు లేవు కానీ ఎలాంటి కథను రాశాడనేది ఆసక్తి రేపుతోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ వస్తే చిరంజీవిని ఆషామాషీగా చూపించనని చెప్పిన సంగతి గుర్తే.

వకీల్ సాబ్ ద్వారా పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న లక్ష్యాన్ని తీర్చుకున్న దిల్ రాజుకి ఇప్పుడు చిరంజీవితో అయిపోతే సంపూర్ణంగా ఫీలవుతారు. రామానాయుడు లాగా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితోనూ ఎస్విసిలో సినిమాలు ఉండాలన్నది రాజుగారికి కోరిక. కాస్త టైం పడుతున్నా సరే అన్నీ తీర్చేసుకుంటున్నారు. తమిళంలో ఆల్రెడీ విజయ్ తో మొదలుపెట్టి మంచి బోణీ కొట్టేశారు. రజినీకాంత్ ది తృటిలో మిస్ అయ్యింది కానీ మళ్ళీ సెట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ ఒప్పుకునే ప్రాజెక్ట్ అనిల్ రావిపూడిదే కావొచ్చేమో చూడాలి.