హీరోలందరూ తగ్గక తప్పదా?

టాలీవుడ్‌లో ఇప్పుడో అనూహ్య పరిణామం నిర్మాతలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా టైంలో ఊపందుకున్న డిజిటల్ మార్కెట్ ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రేక్షకులకు డిజిటల్ కంటెంట్ అలవాటు చేయడానికి ఆరంభంలో భారీగా ఖర్చు పెట్టిన ఓటీటీలు.. ఇప్పుడు రూటు మార్చాయి. తాము పెట్టిన పెట్టుబడికి తగ్గట్లు రికవరీ లేకపోవడంతో, సబ్‌స్క్రిప్షన్లు ఒక స్థాయిని మించకపోవడంతో కాస్ట్ కటింగ్ మీద దృష్టిపెట్టాయి.

ఇందులో భాగంగా ఇబ్బడిముబ్బడిగా సినిమాలను కొనట్లేదు. సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్నాయి. అలా కొన్న సినిమాల విషయంలోనూ రేటు తగ్గిస్తున్నాయి. దీంతో కొన్ని పెద్ద సినిమాలకు కూడా డిజిటల్ డీల్స్ అనుకున్నంత మేర జరగట్లేదు. కొన్ని క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాకు కూడా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోని పరిస్థితి నెలకొంది. పెరిగిన డిజిటల్ మార్కెట్ చూసుకుని హీరోల పారితోషకాలు, అలాగే బడ్జెట్లు అసాధారణంగా పెంచేశారు.

ఇప్పుడు చూస్తే పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్ జరక్క నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. బడ్జెట్ విషయంలో ముందే చూసుకోకుంటే నిండా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. రవితేజ-గోపీచంద్ సినిమా హోల్డ్‌లో పడటానికి ప్రధాన కారణం పెట్టబోయే బడ్జెట్‌కు, బిజినెస్‌కు పొంతన కుదరకపోవడమేనట. బడ్జెట్లను తగ్గించే విషయమై మొత్తంగా ఇండస్ట్రీలో ఒక చర్చ జరిగి, పరిష్కార మార్గాలు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.

పెరిగిన డిజిటల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా పారితోషకాలు పెంచేసిన హీరోలు.. మారిన పరిస్థితుల్లో రాజీ పడకపోతే నిర్మాతలు నిండా మునిగిపోతారనే చర్చ జరుగుతోంది. స్టార్ హీరోలతో సూటిగా ఈ విషయం చెప్పి వారి పారితోషకాలను తగ్గించేంత సామర్థ్యం నిర్మాతలకు ఉందా అన్నది ప్రశ్న. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని హీరోలే ఈ విషయంలో కొంచెం త్యాగం చేయక తప్పదని.. లేదంటే నిర్మాతలు అన్యాయం అయిపోతారనే చర్చ జరుగుతోంది.