విశ్వంభర.. 70 శాతం ఎఫెక్ట్సేనట

మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేయబోయే చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. ప్రి ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్న నేపథ్యంలో వశిష్ఠ మరోసారి ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా ‘విశ్వంభర’లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం గురించి చెప్పాడు. సినిమాలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సన్నివేశాలుంటాయని అతను తెలిపాడు. ‘‘నా రెండో సినిమాకే చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైనపుడు నేను స్కూల్లో చదువుతున్నా. 

ఆ సినిమా చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. మధ్యలో ‘అంజి’ సినిమా చేసినా.. అది పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ కాదు. ‘విశ్వంభర’లో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాల, త్రిశూల శక్తి… లాంటి అంశాలకు ఆధ్యాత్మికతను జోడిస్తూ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం’’ అంటూ మెగా అభిమానులను ఎగ్జైట్ చేసే మాటలు చెప్పాడు వశిష్ఠ.