సీరియస్ డ్రామాల బాక్సాఫీస్ యుద్ధం

గత వారం దీపావళి పండగ సందర్భంగా విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏమంత జోష్ ఇవ్వలేకపోయాయి. జపాన్ మొదటి ఆటకే ఆడియన్స్ తిరస్కరించగా, తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్ తండా డబుల్ ఎక్స్ మన జనాలకు కనెక్ట్ కాలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. ప్రీ రిలీజ్ కు ముందున్న హైప్, సల్మాన్ ఖాన్ ఇమేజ్ పుణ్యమాని టైగర్ 3 మూడు రోజులు బాగానే ఆడినప్పటికీ తర్వాత విపరీతంగా నెమ్మదించింది. రెండో వారంలో వసూళ్లు ఇంకా పడిపోతాయని ట్రేడ్ టాక్. జవాన్, పఠాన్ లను దాటడం అసాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేస్తున్నారు.

ఇక రేపటి పోరు ఆసక్తికరంగా ఉంది. మంగళవారం మీద క్రమంగా హైప్ పెరుగుతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఎంపిక చేసిన సెంటర్లలో ఇవాళ రాత్రే ప్రీమియర్లు వేస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇద్దరి మీదే ప్రమోషన్ల భారం ఉన్నా దాన్ని బాగా నిర్వర్తించారు. క్రైమ్ ప్లస్ హారర్ కలగలిసిన మంగళవారంలో ఊహించినని ట్విస్టులు షాక్ ఇస్తాయని టీమ్ తెగ ఊరిస్తోంది. మొదటి భాగం రిలీజ్ లో జరిగిన జాప్యం వల్ల ఫ్లాపైన సప్తసాగరాలు దాటి సీక్వెల్ సైడ్ బి మీద మెల్లగా బజ్ వస్తోంది. అసలు కథ ఇందులో చెప్పబోతున్న విషయం పబ్లిక్ కి అర్థమైపోయింది.

మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి రెండూ హై ఎమోషన్ మీద నడిచే సీరియస్ డ్రామాలు. ఒక దాంట్లో సస్పెన్స్ కు పెద్ద పీఠ వేస్తే మరొకటి రివెంజ్ మీద నడుస్తుంది. ఇవి కాకుండా మెహ్రీన్ నటించిన స్పార్క్ లైఫ్ లో కొత్త హీరో కావడంతో దాని మీద హైప్ లేదు. హన్సిక మై నేమ్ ఈజ్ శృతి వస్తోంది. టాక్ వస్తే తప్ప ఆడియన్స్ వీటి వైపు చూడలేని పరిస్థితి. గత కొన్ని వారాలుగా టికెట్ కౌంటర్లకు ఊపిచ్చిన సినిమాలు పెద్దగా రాలేదు. ఆ కారణంగానే అయిదో వారంలో అడుగు పెడుతున్న భగవంత్ కేసరికే మంచి వసూళ్లు వస్తున్నాయి. మరి ఈ ఫ్రైడే అజయ్ భూపతి, రక్షిత్ శెట్టి తమకు అందివచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలా వాడుకుంటారో.