అక్కయ్య బాటలోనే మెగా చెల్లెలు

మెగాస్టార్ కుటుంబం నుంచి క్రికెట్ టీమ్ అంత హీరోలున్నారని సోషల్ మీడియాలో తరచు జోకులు పేలే సంగతి తెలిసిందే. ఆ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ కామెంటరీకి వెళ్లిన వరుణ్ తేజ్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించి తమతో గేమ్ ఆడించమని కూడా సరదాగా అడగడం ఫ్యాన్స్ దృష్టి దాటి పోలేదు. అయితే మెగా ఫామిలీలో అమ్మాయిల వైపు నుంచి తెరమీద కనిపించింది నీహారిక ఒక్కరే. ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది కానీ అన్నీ డిజాస్టర్లే. ఆఖరికి సైరా నరసింహారెడ్డిలో జూనియర్ ఆర్టిస్టుల మధ్యన కూడా వేషం వేసింది.

ఇదిలా ఉండగా నీహారిక సినిమా ప్రొడక్షన్ లో అడుగు పెట్టనుంది. పెదనాన్న కూతురు కం అక్కయ్య సుష్మిత ఆల్రెడీ నిర్మాతగా చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి శోభన్ బాబు కనీసం ఊసులో లేనంత దారుణంగా పోయింది. అంతకు ముందు షూట్ అవుట్ అట్ అలైర్ వెబ్ సిరీస్ తీసింది కానీ అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్ సేనాపతికి మాత్రమే డీసెంట్ టాక్ వచ్చింది. ఓటిటి రిలీజ్ కావడంతో రీచ్ పరిమితమే. అయితే నీహారిక వెబ్ సిరీస్ లతో ముందు నుంచి షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్ లతో యాక్టివ్ గా ఉండేది కానీ ఫిలిం ప్రొడక్షన్ లో దిగలేదు.

యధు వంశీ అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అంతా కొత్త క్యాస్టింగ్ తో తీయబోయే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. పేర్లు, సాంకేతిక వర్గం తదితర వివరాలు రేపు వెల్లడించబోతున్నారు. విడాకులు తీసుకున్నాక వ్యక్తిగత జీవితం పరంగా కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక దీనికన్నా ముందే భర్తతో ఒక ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టింది. కానీ తర్వాత జరిగిన పరిణామాలు దాన్ని ముందుకు వెళ్లనివ్వలేదు. సుష్మిత తన తండ్రి చిరంజీవి హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసుకుంది కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే.