దమ్ మసాలా ఘాటులో మహేష్ మాస్  

నెలల తరబడి మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. గుంటూరు కారం మొదటి ఆడియో సింగల్ ని చెప్పిన డేట్, చెప్పిన టైంకి మిస్ కాకుండా రిలీజ్ చేశారు. గతంలో హారికా హాసిని సంస్థ నుంచి జరిగిన ఆలస్యానికి భిన్నంగా ఈసారి ఆన్ టైం మైంటైన్ చేశారు. మొన్నో ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ దీని అప్డేట్ ఇచ్చినప్పటి నుంచి మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. పైగా తమన్ మీద ఈ ప్రాజెక్టు విషయంలో ఒత్తిడి ఉంది. ట్యూన్ల మీద ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఫైనల్ గా దమ్ మసాలా బిర్యానీ గుద్ది పారెయ్ గుంటూర్ని అంటూ వచ్చేసింది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో మహేష్ పాత్ర ఎలివేషన్ ని ఓ రేంజ్ లో ఇచ్చారు. ఎవరీబడి మేక్ ఏ వే లీడర్ ఆన్ ది వే అంటూ ఇంగ్లీష్ లిరిక్స్ ని పొందుపరిచి క్రమంగా ఊర మాస్ తెలుగు పదాలతో నింపేశారు. హక్కులు ఎవరికో ఎందుకు ఇవ్వాలి, ఎవడికో లెక్కలు ఎందుకు చెప్పాలంటూ హీరో మనస్తత్వాన్ని ప్రతిమిబించేలా అణువణువూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా సాగాయి. తమన్ బీట్స్ మరీ స్పెషల్ అని చెప్పలేకపోయినా చాలా క్యాచీగా ఉన్నాయి. ఒకప్పటి దూకుడు ఇన్స్ ట్రుమెంటేషన్ వినిపించింది. వినగా వినగా స్లో పాయిజన్ లా జనాల్లోకి వెళ్లడం ఖాయమే.

గాయకులు సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ స్వరాలు హుషారుగా సాగిపోయాయి. ఇక విజువల్స్ సంగతి చూస్తే రెండు మూడు కీలక షాట్స్ తో పాటు సెట్స్ పై వర్కింగ్ స్టిల్స్ తో సరిపెట్టేశారు. ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ పుట్టినరోజుకి రిలీజ్ చేయాలన్న సంకల్పంతో ఇలా కానిచ్చేశారు. అయినా సరే మాస్ కి కావాల్సిన బీడీ బిట్స్ తో పాటు కుర్చీ మీద కూర్చుని మహేష్ ఇచ్చిన ఫోజులు బాగా వెళ్లేలా ఉన్నాయి. దీని స్థాయి ఎంతదాకా వెళ్తుందనేది ఇంకొద్ది రోజులు ఆగితే అర్థమవుతుంది. మొత్తానికి గుంటూరు కారం ప్రమోషన్స్ గ్రాండ్ గా సరైన కంటెంట్ తోనే మొదలైపోయాయి.