వెయ్యి కోట్లు వస్తాయా టైగర్ సాబ్

సరిగ్గా ఇంకో పది రోజుల్లో టైగర్ 3 విడుదలకు రంగం సిద్ధమయ్యింది. పఠాన్ తర్వాత యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న భారీ చిత్రం కావడంతో పబ్లిసిటీ పరంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఈసారి తెలుగు వెర్షన్ మీద మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మెయిన్ థియేటర్లకు ఆల్రెడీ కటవుట్లు, పబ్లిసిటీ మెటీరియల్ చేరిపోయింది. ఉదయం 7 గంటల నుంచే షోలు మొదలు పెట్టుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. దీపావళి పండగ వరస సెలవులను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో టైగర్ 3 ప్రత్యేకంగా ఆదివారం రిలీజ్ ని టార్గెట్ చేసుకుంది.

మరి వెయ్యి కోట్ల లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటుందా అంటే విశ్లేషకులు సాధ్యమే అంటున్నారు. ఎందుకంటే జవాన్, గదర్ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఫీడింగ్ ఇచ్చిన బాలీవుడ్ మూవీ మరొకటి రాలేదు. సో సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులకు జనం పోటెత్తడం ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి. అయితే కథ పరంగా గూఢచారి బ్యాక్ డ్రాప్ లో వచ్చినవి క్రమంగా రొటీన్ అవుతున్న నేపథ్యంలో అలాంటి ఫీలింగ్ రాకుండా దర్శకుడు మనీష్ శర్మ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. మరి తెరమీద అవుట్ ఫుట్ అంచనాలకు తగ్గట్టు వస్తే కలెక్షన్ల జాతరను దేశమంతా చూడొచ్చు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణంగా పోయాక పోటీదారు షారుఖ్ రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. జనం మర్చిపోయిన సన్నీ డియోల్ కెరీర్ టాప్ నమోదు చేసుకున్నాడు. సో ఇప్పుడు సల్మాన్ తన సత్తా చాటాలి. డౌన్ అయిన రెండుసార్లు ఆదుకుంది ఈ టైగర్ సిరీసే. ఇప్పుడు కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ మూవీ మార్వెల్స్ వస్తున్నా సరే దేశంలో ఐమ్యాక్స్ స్క్రీన్లన్నీ టైగర్ 3కే వచ్చేలా యష్ సంస్థ చక్రం తిప్పిందని ఎగ్జిబిటర్స్ టాక్.