లారెన్స్ సూర్యను అంతసేపు చూడగలరా

నిడివి విషయంలో స్ట్రెయిటైనా డబ్బింగైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. నవంబర్ 10 విడుదల కాబోతున్న జిగర్ తండా డబుల్ ఎక్స్ నిడివి అక్షరాలా 2 గంటల 52 నిముషాలు. అంటే మూడు గంటలకు అతి దగ్గరగా అన్నమాట. లారెన్స్ – ఎస్జె సూర్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. గద్దలకొండ గణేష్ అసలు మూలం ఈ జిగర్ తండా మొదటి భాగమే. అందులో బాబీ సింహా పోషించిన పాత్రే ఇక్కడ వరుణ్ తేజ్ చేశాడు. ఫలితం ఒకేలా రానప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా మెగా ప్రిన్స్ కి ఒక మంచి అచీవ్మెంట్ లా మిగిలిపోయింది .

ఇదంతా బాగానే ఉంది కానీ జిగర్ తండా డబుల్ ఎక్స్ కి ఇంత లెన్త్ అంటే తెలుగు ప్రేక్షకులను మెప్పించడం పెద్ద సవాలే. ఎందుకంటే అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా రూపొందిన ఈ మాఫియా డ్రామాని మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఊహించడం కష్టం. చాలా గ్యాప్ తర్వాత విశాల్ కు దక్కిన పెద్ద హిట్ గా మార్క్ ఆంటోనీ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు చెబితే తెలుగులో మాత్రం సూపర్ ఫ్లాప్ గా నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో అంత లౌడ్ కామెడీని, రిపీట్ స్క్రీన్ ప్లేని మనవాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే ఇక్కడ ఆడలేదు.

ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ లోనూ ఆ రిస్క్ లేకపోలేదు. లారెన్స్ కి మునుపటి ఇమేజ్ ఇప్పుడు తెలుగులో లేదు. రుద్రుడు, చంద్రముఖి 2కి దక్కిన తిరస్కారమే దానికి ఉదాహరణ. అఫ్కోర్స్ కంటెంట్ దారుణంగా ఉండటం వేరే విషయం. ఎస్జె సూర్య కోసమే ప్రత్యేకంగా థియేటర్లకొచ్చే అభిమానులు మన దగ్గర లేరు. అలాంటప్పుడు ఇంత నిడివితో కన్విన్స్ చేయడం ఛాలెంజ్ లాంటిదే. లైన్ అయితే మొదటి భాగానికి దగ్గరగా అనిపిస్తోంది. జపాన్ కార్తీ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, సల్మాన్ ఖాన్ టైగర్ 3తో దీపావళికి పెద్ద పోటీ ఎదురుకోబోతున్న జిగర్ తండాకు కనీసం తెలుగు టైటిల్ పెట్టకపోవడం బ్యాడ్ ట్విస్ట్.