మృణాల్ సినిమాపై కంగనా దెబ్బ

టాలీవుడ్లో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ముందువరసలో ఉంది. ఇది సీతరామం ఎఫెక్టని మళ్ళీ చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నాయి. న్యాచురల్ స్టార్ నానితో చేసిన హాయ్ నాన్న మీద చాలా ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకంగా ప్రమోషన్ల కోసం ఒక నెల ముందే హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇంకో పక్క విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మీద బిజినెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ వస్తోంది. ఇవి రెండు హిట్ అయితే ఇక్కడే సెటిలైపోవచ్చనే ఆలోచన తనలో లేకపోలేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ కంగనా ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందో చూద్దాం. గంపెడాశలు పెట్టుకుని కంగనా రౌనత్ నటించిన తేజస్ ఇటీవలే బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న సంగతి తెలిసిందే. కనీసం థియేటర్ అద్దెలు కాదు కదా ప్రింట్ ఖర్చులు తేలేనంత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తేజస్ నిర్మాత రోన్ని స్క్రూవాలా. ఈయన 2021 నుంచి దీంతో పాటు మరో సినిమాని సమాంతరంగా షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. దాని టైటిల్ పిప్ప. ఇషాన్ కట్టర్ హీరోగా నటించగా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. ఇది కూడా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందటం మరో ట్విస్టు.

తేజస్ ఫలితం చూసి గుండె ఆగినంత పనైన రోన్నీ స్క్రూవాలా పిప్పని నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నారని ముంబై అప్డేట్. దీపావళికే స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. పిప్పకు 75 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. దీని కోసమే మృణాల్ ఠాకూర్ ప్రత్యేకంగా కఠినమైన శిక్షణ తీసుకుంది. ఇప్పుడు కంగనా తేజస్ పోవడంతో ఈమె పిప్పాని థియేటర్లో చూసే ఛాన్స్ లేకుండా పోతోంది. రిస్క్ తీసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేకే ప్రొడ్యూసర్ ఇలా చేస్తున్నారట. తప్పదు మరి ఎవరి కష్టాలు వారివి. డబ్బు ఆయనదే కదా.