టైగర్ బయటపడినట్లేనా?

రవితేజ కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుందని ‘టైగర్ నాగేశ్వరరావు’ మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ దసరా కానుకగా మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉన్నా.. రవితేజ పెర్ఫామెన్స్ బాగున్నా.. చాలా మైనస్‌లు ఉండటంతో నెగెటివ్ టాక్ వచ్చింది. కొన్ని అనవసర ఎపిసోడ్లు, ద్వితీయార్ధంలో సాగతీత మైనస్ అయ్యాయి.

దీంతో సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాలేదు. తొలి వీకెండ్ పరిస్థితి చూస్తే రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్ అవుతుందేమో అన్న భయాలు కలిగాయి. అతను డిఫరెంట్‌గా ఏం ట్రై చేసినా.. ఇలాంటి ఫలితాలే వస్తుండటంతో ఇక తన మార్కు మాస్ మసాలా సినిమాలు చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తర్వాతే మొదలైంది అసలు కథ.

‘టైగర్ నాగేశ్వరరావు’కు నిడివే అతి పెద్ద బలహీనత అన్న ఫీడ్ బ్యాక్‌ను బట్టి నిడివి తగ్గించారు. 2 గంటల 37 నిమిషాల రన్‌టైంతో కొత్త వెర్షన్‌ను థియేటర్లలో ఆడించారు. ఇది ప్లస్ అయింది. ‘లియో’ సినిమా పడుకోవడం కూడా ‘టైగర్’కు కలిసొచ్చింది. దసరా సెలవులను కూడా సినిమా బాగానే వాడుకుంది. వీకెండ్ తర్వాత ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోయిందీ చిత్రం. రెండో వారంలో సరైన సినిమాలు లేకపోవడం ‘టైగర్’కు కలిసొచ్చింది. ‘భగవంత్ కేసరి’ తర్వాత సెకండ్ ఛాయిస్ ఈ సినిమానే అయింది. రవితేజ అభిమానులు కూడా సినిమాను బాగాన చూస్తున్నారు.

దీంతో సినిమా నెమ్మదిగా సేఫ్ జోన్ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. షేర్‌లో రూ.30 కోట్ల మార్కుకు చేరువగా వచ్చింది. మొదట వచ్చిన టాక్‌తో పోలిస్తే ఈ మాత్రం వసూళ్లు రావడం గొప్పే. నిర్మాత నాన్ థియేట్రికల్ హక్కు్లను భారీ మొత్తానికి అమ్మి సేఫ్ అయ్యాడు. థియేట్రికల్ హక్కులను కూడా ఓ మోస్తరు మొత్తాలకే అమ్మాడు. కాబట్ట ిఫుల్ రన్ అయ్యేసరికి బయ్యర్లు కూడా సేఫ్ జోన్లోకి వచ్చి అయి సినిమా సేఫ్ అయిపోతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.