దీపావళి పండగకు డబ్బింగుల మోత

సంక్రాంతి, దసరా పండగల రేంజ్ లో దీపావళికి తెలుగు నాట బాక్సాఫీస్ మైలేజ్ పెద్దగా ఉండదు. కారణం సెలవులు ఒకటి రెండు రోజులకు మాత్రమే పరిమితం కావడం. అందుకే మన నిర్మాతలు ఈ సీజన్ ని లైట్ తీసుకునే సందర్భాలే ఎక్కువ. అయితే ఈసారి చెప్పుకోదగ్గ సినిమాలు బాగానే వస్తున్నాయి కానీ అధిక శాతం డబ్బింగ్ బాపతే కావడం ఆసక్తి రేపుతోంది. ముందుగా నవంబర్ 12న రిలీజవుతున్న సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మీద ఎంత హైప్ ఉందో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. పఠాన్, జవాన్ తెలుగు వెర్షన్లు మంచి వసూళ్లు తెచ్చిన నేపథ్యంలో యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

కార్తీ ‘జపాన్’ 10నే రావొచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ట్రైలర్ తో పాటు డేట్ ని ఇవాళ ప్రకటించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ హక్కులు సొంతం చేసుకోవడంతో రిలీజ్ గ్రాండ్ గా ఉండబోతోంది. గత ఏడాది సర్దార్ పంపిణి జరిగింది ఈ సంస్థ ద్వారానే. నాగార్జునతో ఉన్న అనుబంధం కార్తీకి ఈ రకంగా ఉపయోగపడుతోంది. లారెన్స్ – ఎస్జె సూర్య కాంబోలో రూపొందిన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ జపాన్ తో క్లాష్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం గ్యాప్ తో ఆపై వారం ‘సప్తసాగరాలు దాటి సైడ్ బి’ థియేటర్లో అడుగు పెట్టనుంది. ఇవన్నీ అనువాదం బ్యాచే.

తెలుగు స్ట్రెయిట్ సినిమాల వరకు చూసుకుంటే 10న వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ ఇంకా అంచనాలు పెంచే పని మొదలుపెట్టలేదు. పాట రిలీజ్ తో ఇటీవలే పబ్లిసిటీ మొదలయ్యింది. వర్మ ‘వ్యూహం’ని అధికార పార్టీ మద్దతు దారులు తప్ప సామాన్య ప్రేక్షకులు పట్టించుకోవడం అనుమానమే. పండగ అయ్యాక అజయ్ భూపతి ‘మంగళవారం’తో భయపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. సో టపాసుల పండగ రోజు థియేటర్ కు ఎంజాయ్ చేయాలంటే ఆదికేశవ ఒకవైపు ఉంటే డబ్బింగులు మాత్రం బోలెడు ఆప్షన్లు ఇస్తున్నాయి. జైలర్, లియోకు వచ్చిన కలెక్షన్లు చూసి వీటికీమధ్య డిమాండ్ పెరిగిపోయింది.