విజయ్ పరువు తీస్తున్న ‘లియో’

తమిళ టాప్ స్టార్ విజయ్‌కి ‘లియో’ ఒక మరపురాని బ్లాక్ బస్టర్‌ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగర్గ ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శించి.. ఆ తర్వాత చల్లబడిపోయింది. తెలుగులో వీకెండ్ తర్వాత ‘లియో’ సౌండ్ లేదు. తమిళంలో కూడా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. కానీ నిర్మాతలు మాత్రం పోస్టర్ల మీద 300 కోట్లు, 400 కోట్లు అంటూ ఘనంగా వేసుకుంటున్నారు. డివైడ్ టాక్‌తో ఈ వసూళ్లేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

కానీ ఈ వసూళ్లంతా ఫేక్ అనే విషయం నెమ్మదిగా అర్థమవుతోంది. ‘లియో’ బుకింగ్స్, కలెక్షన్స్ పెద్ద స్కామ్ అనే విషయాన్ని స్వయంగా థియేటర్ల యజమానులే చెబుతుండటంతో విజయ్ అండ్ టీం పరువు పోతోంది. యుఎస్‌లో ‘లియో’ రూ.18 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు పోస్టర్ల మీద వేశారు.

కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టుకుని ప్రాక్సీ బుకింగ్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాకు క్రేజ్ పెంచడానికి ప్రయత్నించినట్లుగా ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు తమిళనాట కూడా ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు లేవంటూ థియేటర్ల యజమానులు పలువురు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడైన తిరుపూర్ సుబ్రహ్మణ్యం అనే ఎగ్జిబిటర్.. ‘లియో’ వసూళ్ల లొసుగులను బయటపెడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

‘లియో’ వాస్తవ వసూళ్లకు, నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్లకు పొంతన లేదని అతనన్నాడు. తాను కలెక్షన్ స్కామ్ గురించి బయటపెట్టినందుకు ‘లియో’ నిర్మాత తనను బెదరించాడని చెప్పాడు. మరో ఎగ్జిబిటర్.. ‘లియో’కు అసలు నిర్మాత విజయే అని, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన లలిత్ అతడి ఉద్యోగి అని ఆరోపించాడు. ఈ సినిమాకు థియేటర్లలో తక్కువ వసూళ్లు వస్తున్నట్లు చెప్పాడు. మొత్తంగా ‘లియో’ ఫేక్ వసూళ్ల గురించి విపరీతమైన చర్చ జరుగుతుండటంతో విజయ్ పరువు పోతోంది.