అమలాపాల్‌కు మళ్లీ పెళ్లి

కెరీర్ చరమాంకంలోకి వచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి వైపు అడుగులు వేసే వాళ్లే. ఐతే అమలా పాల్ మాత్రం కొంచెం భిన్నం. ఆమె తన కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహం ఎంతో కాలం నిలవలేదు. తనకు కేవలం పాతికేళ్ల వయసుండగా.. కెరీర్ మంచి ఊపు మీదుండగా ఆమె తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడటం.. రెండేళ్లకే వీళ్లిద్దరూ విడిపోవడం తెలిసిందే.

ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు మరో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లలేదు అమలా. మధ్యలో ఒక సింగర్‌తో ఆమెకు పెళ్లయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అదంతా ఉత్తుత్తిదే అని తర్వాత తేలింది. ఐతే ఎట్టకేలకు అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న జగత్ దేశాయ్‌తో ఆమె వివాహ బంధంలోకి వెళ్లనుంది. అతడి మ్యారేజ్ ప్రపోజల్‌కు తాజాగా అమలా ఆమోద ముద్ర వేసింది.

తాజాగా అమలా తన 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆ సందర్భంగా జగత్‌తో కలిసి ఆమె డేట్‌కు వెళ్లింది. ఇద్దరూ డిన్నర్ చేసిన అనంతరం అమలాకు జగత్ ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. ఈ వీడియోను జగతే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ బంధం అధికారికం అయింది. కొంత కాలంగా జగత్‌తో కలిసి అమలా తరచుగా మీడియా కళ్లలో పడుతోంది.

అప్పుడే వీళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ నడుస్తోందని అర్థమైంది. ఇప్పుడు అఫీషియల్‌గా తమ రిలేషన్ గురించి ఈ జంట మీడియాతో పాటు అందరికీ చెప్పేసింది. తమిళంలో ఒక బి గ్రేడ్ మూవీతో అమలా కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా విషయంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా అమలా మాత్రం పాపులర్ అయింది. ఆ తర్వాత ‘మైనా’ సినిమా మెయిన్ స్ట్రీమ్ మూవీస్‌లో ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సహా పలు చిత్రాల్లో నటించింది అమలా.