అప్పుడు మోడీ సినిమా.. ఇప్పుడు ఇది

ఎన్నికలు వస్తున్నాయంటే జనాలను ప్రభావితం చేయడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవు. ఇందులో భాగంగా తమ భావజాలాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాల మీద కూడా ఆధారపడుతుంటాయి. ఐతే ఆ సినిమాల్లో చూపించిందంతా నిజమని నమ్ముతాయని గ్యారెంటీ లేదు. ఎన్నికల టైంలో రిలీజైన కొన్ని సినిమాలను ప్రేక్షకులు దారుణంగా తిప్పి కొట్టిన సందర్భాలు లేకపోలేదు. గత ఎన్నికలకు ముందు తెలుగులో వచ్చిన ‘యన్.టి.ఆర్’ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే.

ఈ సినిమాకు హీరో, నిర్మాత తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా అయిన నందమూరి బాలకృష్ణ అన్న సంగతి తెలిసిందే. ఉన్నంతలో మంచి సినిమానే తీసినా.. అది ఆ సమయంలో ప్రేక్షకులకు రుచించలేదు. దాన్నొక ప్రాపగండా మూవీలాగే చూశారు జనం. అలాగే హిందీలో నరేంద్ర మోడీ మీద ఒకటికి రెండు సినిమాలు తీసి వదిలారు. అవి వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. కాకపోతే ఎన్నికల ఫలితాల మీద ఆ సినిమాల పెద్దగా ప్రభావం చూపలేదు.

కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రాయోజిత సినమా మరొకటి ఎన్నికల ముంగిట సిద్ధమవుతోంది. వందేళ్ల ఘన ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) మీద ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం రాబోతోంది. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మీద ‘వన్ నేషన్’ పేరుతో పెద్ద బడ్జెట్లో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను ఆరుగురు జాతీయ అవార్డు విజేతలైన దర్శకులు తీస్తుండటం విశేషం.

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో పాటు ‘కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది, జాన్ మాథ్యూ మథన్, మంజు బోరా, సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ ఉమ్మడిగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బహుశా కథలోని ఎపిసోడ్లను పంచుకుని వీళ్లు డైరెక్ట్ చేస్తుండొచ్చు. పోస్టర్ మీద కనిపిస్తున్న దర్శకుల పేర్లు చూస్తే ఎగ్జైటింగ్‌గానే అనిపిస్తోంది కానీ.. ఎన్నికల ముంగిట ఆర్ఎస్ఎస్ మీద సినిమా అంటే ఇదొక ప్రాపగండా మూవీలాగే జనం చూసే అవకాశముంది. మరి మోడీ మీద తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.