కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ‘మహాభారతం’

మహాభారతం మీద సినిమా అనగానే ఇప్పుడందరికీ రాజమౌళి వైపే దృష్టి మళ్లుతోంది. ఆ మహా గ్రంథం నేపథ్యంలో సినిమా తీయడం తన కల అని రాజమౌళి ఎప్పట్నుంచో చెబుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టు చేయడానికి ఇంకో పదేళ్ల అనుభవం అవసరం అని రాజమౌళి చెప్పి పదేళ్లు కావస్తోంది. ఇక ఆయన ఎంత త్వరగా ఆ సినిమాను మొదలుపెడితే అంత మంచిదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

మహేష్ బాబుతో చేయబోయే సినిమా తర్వాత రాజమౌళి తన కలల సినిమా పని మొదలుపెడతాడని భావిస్తున్నారు. కానీ ఇంతలో బాలీవుడ్లో మహాభారతం మీద ఒక భారీ చిత్రం శ్రీకారం చుట్టుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమా చేయబోతున్నాడు. ‘పర్వ’ పేరుతో రానున్న ఈ మెగా మూవీని మూడు భాగాలుగా తీస్తారట. ఈ రోజే దాని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది.

గొప్ప నవలగా పేరు తెచ్చుకున్న ‘పర్వ’ ఆధారంగా వివేక్ ఈ సినిమా చేయబోతున్నాడట. మహాభారతాన్ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించిన ‘పర్వ’ నవలను డాక్టర్ బైరప్ప రాశారు. ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా దక్కింది. ఆయన్నుంచి రైట్స్ తీసుకుని.. పలు భాషల్లో ఒకేసారి ‘పర్వ’ను తెరకెక్కంచబోతున్నాడు వివేక్. బైరప్పతో అగ్రిమెంట్ చేసుకున్న వీడియోను పోస్ట్ చేసి.. ఈ సినిమా గురించి అతను అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు.

ఐతే మహాభారతం, రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఘనంగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారే తప్ప ఏవీ ముందుకు వెళ్లట్లేదు. నిజానికి బాలీవుడ్ వాళ్లలో కూడా చాలామందికి మహాభారతాన్ని గ్రాండ్ కాన్వాస్‌లో రాజమౌళి తీస్తేనే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. ఈలోపు వేరే వాళ్లు దాన్ని టచ్ చేయకపోతేనే బెటర్ అన్న ఉద్దేశమే చాలామందికి ఉంది. ‘కశ్మీర్ ఫైల్స్’ అనుకోకుండా హిట్టయింది కానీ.. వివేక్ తర్వాతి సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అంతకుముందు కూడా వివేక్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఇలాంటి దర్శకుడు మహాభారతం ఏం తీస్తాడనే చర్చ నడుస్తోంది.