సుశాంత్…రియా…మధ్యలో డ్రగ్స్?

బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసు సినీ ఫక్కీలో రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యగా మొదలైన ఈ కేసు…అనుమానాస్పద మృతిగా మారి…చివరకు సుశాంత్ హత్యకు గురయ్యాడన్న కోణంలో ప్రచారం జరిగే స్థాయికి చేరుకుంది. సుశాంత్ చనిపోవడానికి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. సుశాంత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా, ఆమె తండ్రి ఇంద్రజిత్ కు సీబీఐ ఇప్పటికే సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో తాజాగా రియా చక్రవర్తికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ డీలర్లతో రియా చక్రవర్తికి సంబంధాలున్నాయని సీబీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో రియా సంప్రదింపులు జరిపిందని, వారిద్దరి వాట్సాప్ చాట్ సంభాషణను సీబీఐ అధికారులకు ఈడీ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది.

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు…దుబాయ్ కు చెందిన ఆయుష్ ఖాన్ అనే ఓ డ్రగ్ డీలర్…సుశాంత్ ను కలిశాడని బీజేపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఏం జరిగిందో విచారణ జరపాలని, అపుడు నిజాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రియాతో పాటు ఆమె సోదరుడిని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. రియా డ్రగ్స్ డీలర్లతోనూ సంప్రదింపులు జరిపేదని ఆమె వాట్సప్‌ చాటింగ్‌ ద్వారా తేలినట్లు తెలుస్తోంది. డ్రగ్ డీలర్ గా ఆరోపణలు ఎదుర్కొంటోన్న గౌరవ్‌తో 2017 మార్చి 8 నుంచి ఆమె సంప్రదింపులు జరుపుతోందని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రభావవంతమైన డ్రగ్స్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి గౌరవ్ తో ఆమె ఆరా తీసిందని, మరికొందరు డ్రగ్స్ డీలర్లతోనూ ఆమె సంప్రదింపులు జరిపిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సుశాంత్ కు డాక్టర్లు ప్రిస్ క్రైబ్ చేసిన మందులు కాకుండా కొన్ని మందులను వేసుకునేలా రియా ప్రేరేపించిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ కు రియానే డ్రగ్స్ అలవాటు చేసిందని, వాటి ద్వారా అతడిని లోబరుచుకుందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ డ్రగ్స్ ద్వారానే సుశాంత్ డిప్రెషన్ కు వెళ్లాడని, ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు రాయని మందులు సుశాంత్ వేసుకునేవాడని, అవి డ్రగ్స్ అయ్యి ఉంటాయేమోనని సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ తరపు లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. తాజాగా రియాకు డ్రగ్స్ డీలర్ తో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వికాస్ సింగ్ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రియా లాయర్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.