ట్రోలింగ్ బారిన పడుతున్న మూడో పులి

ఇవాళ విడుదలైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 ట్రైలర్ మీద నార్త్ ఆడియన్స్ లో మిశ్రమ స్పందన దక్కుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ అదే పనిగా స్పై యూనివర్స్ పేరుతో ఒకే కథను తిప్పి తిప్పి తీస్తున్నారని, ఇది బోర్ కొట్టి జనం నో అనే దాకా వదులుతూనే ఉంటారని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఎందుకంటే పఠాన్ లో జాన్ అబ్రహం పాత్ర ఈ టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీగా మార్చారు. కాకపోతే అతన్ని పాకిస్థాన్ కు పంపడం చిన్న ట్విస్టు. దేశద్రోహం కేసు మీద హీరో అవమానాల పాలు కావడం ఎప్పుడో దేవానంద్ జమానా నుంచి జవాన్ దాకా వందల వేలు వచ్చాయి.

యాక్షన్ విజువల్స్ పరంగా భారీతనం పెరిగినప్పటికీ కంటెంట్ పరంగా మాత్రం అంత స్టాండర్డ్ లేదని సగటు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా వెరైటీగా ఉండాలని హీరోయిన్ కత్రినా కైఫ్ విలన్ బ్యాచ్ తరఫున అమ్మాయితో టవల్ చుట్టుకుని ఏదో నగ్నంగా ఫైట్ చేసే రేంజ్ లో ఓ ఎపిసోడ్ పెట్టడం తేడా కొట్టేలానే ఉందని ఫ్యాన్స్ కే అనుమానం వస్తోంది. వీటితో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ నెగటివ్ ఫీడ్ బ్యాక్ బలంగా వినిపిస్తోంది. పది నెలల గ్యాప్ లో రెండు సార్లు ఒకే జానర్ కథను చూపించాలనుకోవడం రిస్కని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీటి సంగతి ఎలా ఉన్నా మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం బద్దలయ్యేలా ఉంటాయి. సల్మాన్ ఇమేజ్ ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. అయితే సినిమాలో దమ్ముండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మొదటి రోజు కండల వీరుడు జనాన్ని రప్పించగలడు కానీ ఆ తర్వాత నిలబెట్టాల్సింది టాకే. కిసీకా భాయ్ కిసీకా జాన్ విషయంలో ఏమయ్యిందో ఎవరూ మర్చిపోలేదు. శుక్రవారం సెంటిమెంట్ ని భిన్నంగా నవంబర్ 12 ఆదివారం విడుదలని ఎంచుకున్న టైగర్ 3 దీపావళి పండగతో పాటు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుంది. జవాన్ రికార్డులు దాటడం గురించి ఇప్పుడే జోస్యం చెప్పడం కష్టం.