దక్షిణాది ప్రేక్షకులకు ఆఫర్లు ఇవ్వరా

జనాన్ని థియేటర్లకు రప్పించడానికి ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ ఐనాక్స్ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 700 రూపాయలు కడితే ఒక నెలలో పది సినిమాలు చూసేయొచ్చు. అంటే ఒక్క టికెట్ ఖరీదు కేవలం 70 రూపాయలు పడినట్టు. ఏ స్క్రీన్ అయినా, ఏ షో అయినా సరే టికెట్ రేట్ మూడు వందల యాభై లోపు ఉంటే చాలు ఈ స్కీం వర్తిస్తుంది. అయితే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. రిక్లైనర్లు, 4డిఎక్స్ తదితర స్పెషల్ క్యాటగిరీలకు ఇది వర్తించదు. అయినా సరే వీక్ డేస్ వరకే చూసుకున్నా ఇది మంచి పథకం.

ట్రాజెడీ ఏంటంటే సౌత్ మొత్తాన్ని ఈ స్కీం నుంచి మినహాయించారు. అంటే ఢిల్లీ. ముంబై. కోల్కతా ఇలా ఏ నగరంలో అయినా డెబ్భై రూపాయలకు మల్టీ ప్లెక్స్ అనుభూతి పొందవచ్చు కానీ హైదరాబాద్, బెంగళూరు, కోచి లాంటి సౌత్ సిటీస్ కి ఇది వర్తించదు. అదేమంటే ఇక్కడి నిబంధనలు, టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాల ప్రమేయం అంటారు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమలు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటివి ఇచ్చిన ఇవ్వకపోయినా మన ఆడియన్స్ ఎలాగూ థియేటర్లకు వెళ్లకుండా, సినిమాలు చూడకుండా ఉండలేరనే బలహీనత మరో కారణం కావొచ్చు.

ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. దసరాకు క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియోలు నువ్వా నేనాని పోటీ పడుతున్నాయి. ఇప్పుడు పివిఆర్ లాంటి సంస్థలు పాస్ పోర్ట్ పేరుతో ఇలా తగ్గింపు రేట్లు ఇచ్చేస్తే ప్రేక్షకులు భారీగా వస్తారు కానీ ఆ మేరకు రెవిన్యూ తగ్గిపోతుంది. అందుకే చాలా తెలివిగా మనల్ని తప్పించారని అనుకోవచ్చు. ఉత్తరాది రాష్ట్రాల మల్టీప్లెక్సుల్లో విపరీత రేట్ల దెబ్బకు జనం తగ్గిపోతున్న తరుణంలో యాజమాన్యాలు ఇలాంటి తెలివైన ఎత్తుగడలు మొదలుపెట్టాయి. మనకూ పెడితే బాగుంటుందనుకోవడం ఊహకే పరిమితం.