తెలుగు లిరిక్స్ మీద కాస్త శ్రద్ధ పెట్టొచ్చుగా  

ఎందరో మహానుభావులు ఒకప్పుడు. అందుకే అందరికీ వందనం పెట్టాలనిపించేది. కానీ ఇప్పుడు కొందరు కూడా కరువైపోయారు. ఇదంతా దేని గురించని అనుకుంటున్నారా. అసలు పాయింట్ కు వెళ్లే ముందు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. 1980 తర్వాత తమిళం నుంచి తెలుగు సినిమాల డబ్బింగ్ తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఇళయరాజా, రెహమాన్ ల శకం దీన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. అనువాద సాహిత్యమైనా సరే అద్భుతమైన విలువలతో రాజశ్రీ గారు రాసేవారు. 1994 ప్రేమికుడు దాకా ఆయన రాసిన ఎవర్ గ్రీన్ లిరిక్స్ శాశ్వతంగా సంగీత ప్రియుల మనసుల్లో ముద్రించుకుపోయాయి.

తర్వాత వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, వెన్నెలకంటి లాంటి లబ్దప్రతిష్టులు డబ్బింగ్ పాటల్లో తమ వంతుగా ఎంతో గొప్ప పల్లవులు, చరణాలు ఇచ్చారు. ఇప్పుడదంతా గతంగా మారిపోయింది. ఊరికే పదాలు రాయించి అక్కడక్కడా ప్రాసలు కుదిరాయో లేదో చూసుకుని మమ అనిపిస్తున్నారు. తాజాగా వచ్చిన లియో నే రెడీనే తెలుగు వెర్షన్ వాయిద్యాల హోరులో అసలేం పదాలు ఉన్నాయో గుర్తు పట్టలేనంత విచిత్రంగా ఉన్నాయి. ఎంత ఫాస్ట్ బీట్ లో సాగే పాట అయినప్పటికీ మరీ ఇలాంటి లిరిక్స్ రాయిస్తారా అంటూ మ్యూజిక్ లవర్స్ ఆన్ లైన్ వేదికగా భగ్గుమంటున్నారు.

ఈ పోకడ కేవలం లియోతో మొదలయ్యింది కాదు. గత పదేళ్లుగా చాలా సినిమాల్లో ఇదే తంతు. గతంలో ఏఆర్ రెహమాన్ అనువాదమైనా సరే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాటల అర్థం తెలుసుకుని ఓకే చేసేవాడు. ఇప్పుడంత ఓపిక లేదు. పెద్ద రచయితలకు లక్షలు ఇచ్చి రాయించుకోవడం కన్నా ఎవరో ఒకరితో మేనేజ్ చేస్తే చాలనే రీతిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అజిత్, రజినీకాంత్, విజయ్, శివ కార్తికేయన్ ఒకరిద్దరిని కాదు అందరిదీ ఇదే తంతు. గత పదేళ్లలో బెస్ట్ డబ్బింగ్ సాంగ్స్ ఒక పది వెంటనే పాడమంటే నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఎవరో వేరే చెప్పాలా.