తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సినిమా టికెట్ల ధరలను సమయానుకూలంగా పెంచుతూనే ఉన్నాయి. అయినా కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు వచ్చాయంటే చాలు.. అదనపు రేట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు నిర్మాతలు. వారం పది రోజులు రేట్లు పెరిగిపోతున్నాయి.
బెనిఫిట్ షోల పేరుతో మరింతగా ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నారనే చర్చా జరుగుతోంది. ఏవో కొన్ని పెద్ద సినిమాలకే కదా రేట్లు పెంచుతున్నాం అంటున్నారు కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూడాలనుకుంటున్నదే ఆ కొన్ని సినిమాలను. వాటికే రేట్లు పెంచి వారిని నిరుత్సాహ పరిస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే నిర్మాతలు మాత్రం ఒక టికెట్ రేటు మీద తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని వాదిస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు మీడియాముందు ఇదే వాదన చేశారు.
‘‘మీడియా వాళ్లు కూడా జనాల్లోకి తీసుకెళ్లాల్సింది ఏంటంటే.. మొన్న చాలా క్లియర్గా లెక్కగట్టామండీ. ఒక టికెట్ మీద 28 శాతం కంటే తక్కువ నిర్మాత చేతికి వస్తోంది. అంటే 100 రూపాయల్లో అన్నీ పోను నిర్మాత ఇంటికి తీసుకెళ్లేది 28 రూపాయలే. దాంట్లోంచి మళ్లీ ఆ సినిమా నుంచి మిగిలితే మేం 35-40 శాతం ఆదాయపు పన్ను కడతాం.
ఇవన్నీ పక్కన పెడితే టికెట్ రేటు 600 కావచ్చు.. 800 కావచ్చు.. ఆ డబ్బులు అన్నీ నిర్మాతే తినేస్తున్నాడు అనుకుంటారు. మీడియా వాళ్లు ప్రేక్షకులకు సపోర్ట్ చేస్తున్నారు.. మీరు కూడా మా కుటుంబంలో భాగమే కాబట్టి మా వైపు నుంచి కూడా ఆలోచించి 600 రూపాయల్లో ఎవరికి ఎంత వెళ్తోంది అనేది విశ్లేషించి జనాలకు చెబితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం’’ అని బన్నీ వాసు వివరించాడు. ‘అఖండ-2’కు రేట్ల పెంపుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు ఇలా స్పందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates