కేజీఎఫ్-2.. ఈసారి ఆయన కాదు ఈయన

‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్: చాప్టర్-2’నే. ‘బాహుబలి: ది బిగినింగ్’ స్థాయిలో కాకపోయినా.. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ కూడా మంచి విజయమే సాధించింది. వివిధ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. దీంతో ‘చాప్టర్-2’ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ సినిమా ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.

కానీ కరోనా వచ్చి ఆరు నెలల పాటు పనంతా ఆపేసింది. ఇప్పటికీ చాలామంది షూటింగ్‌లు చేయడానికి వెనుకాడుతుంటే.. ‘కేజీఎఫ్-2’ టీం మాత్రం ధైర్యంగా అడుగు ముందుకేసింది. బుధవారమే ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయింది. ఇండియాలో చిత్రీకరణ పున:ప్రారంభించిన తొలి భారీ చిత్రం ఇదే.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్.. క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న సంగతి వెల్లడించాడు. ‘కేజీఎఫ్-2’ షూటింగ్ పున:ప్రారంభం అయింది ప్రకాష్ రాజ్‌పై సన్నివేశాలతోనే కావడం విశేషం. ఆయనకు సీన్ పేపర్ ఇచ్చి సన్నివేశం గురించి వివరిస్తున్న ఫొటోలను ప్రశాంత్ షేర్ చేశాడు. సూటేసుకుని జెంటిల్మన్‌ లాగా కనిపిస్తున్నాడు ప్రకాష్. ఆయన అవతారం చూస్తే ‘చాప్టర్-1’లో అనంత్ నాగ్ చేసిన నరేటర్ పాత్రను ఈసారి ఈయన చేస్తున్నాడేమో అనిపిస్తోంది.

దాదాపుగా అదే స్టయిల్లో కూర్చున్న స్టిల్ ఒకటి వదిలారు. ఇదే నిజమైతే హీరో ఎలివేషన్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. కన్నడేతర భాషల వాళ్లు మరింతగా ఈ పాత్రతో కనెక్టవుతారనడంలో సందేహం లేదు. ‘కేజీఎఫ్-2’లో హీరో తర్వాత అందరి దృష్టీ సంజయ్ దత్ పాత్ర మీదే ఉంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా లైన్లోకి రావడం సినిమా మీద అంచనాలు మరింత పెంచేదే. ఈ చిత్రంలో ఇందిరా గాంధీని పోలిన ప్రధాని పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నట్లు సమాచారం.